సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ ఈ నెల 12 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో సర్కారు వారి పాట చిత్ర బృందం వివిధ ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా దర్శకుడు పరశురామ్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా పరశురామ్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.
తాజా ఇంటర్వ్యూలో పరుశురామ్ మాట్లాడుతూ... నేను పుట్టింది... పెరిగింది అంత కూడా వైజాగ్ కి దగ్గర గా ఉన్న 'నర్సీపట్నం' లో. డైరెక్టర్ గుణశేఖర్ మరియు పూరి జగన్నాథ్ లది కూడా అదే ఊరు. అందువలన గుణశేఖర్, పూరి జగన్నాథ్ లతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. 'ఒక్కడు' మూవీ తో సూపర్ స్టార్ మహేశ్ బాబు కి గుణశేఖర్ తిరుగులేని బ్లాక్ బస్టర్ విజయం ఇచ్చాడు. ఇక పూరి జగన్నాథ్ 'పోకిరి' సినిమాతో మహేష్ బాబు కు అదిరిపోయే విజయాన్ని ఇచ్చాడు. దానితో నేను కూడా మహేష్ బాబుతో ఒక అదిరిపోయే సినిమా తీయాలి అని అప్పుడే నిర్ణయించుకున్నాను.
అది ఈ సర్కారు వారి పాట మూవీ తో నెరవేరుతుంది అని అనుకుంటున్నాను. ఈ కథను కేవలం మహేష్ బాబు కోసం మాత్రమే రాశాను. ఒక వేళ ఈ కథను మహేష్ బాబు కనుక రిజెక్ట్ చేసి ఉంటే , ఈ కథను పక్కన పెట్టే వాడిని అని తాజా ఇంటర్వ్యూలో పరశురామ్ తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చగా, ఈ సినిమా కోసం తమన్ సంగీతం సమకూర్చిన పాటలు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందాయి. మరి సర్కార్ వారి పాట సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.