సినీ ప్రేక్షకులకు శుభవార్త... తగ్గనున్న టికెట్ రేట్లు ?
కరోనా కారణంగా రెండేళ్లకు పైగా సినీ పరిశ్రమ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ మధ్యే మళ్ళీ సినీ పరిశ్రమ పుంజుకున్న విషయం తెలిసిందే. కాగా కోట్లు పెట్టి సినిమాలు తీసి పలు చిత్రాలను ఇప్పటికే విడుదల చేయగా వాటిలో కొన్ని మాత్రమే అనుకున్న ఫలితాన్ని అందుకున్నాయి. మరికొన్ని ఊహించని విధంగా నష్టాల్ని తెచ్చిపెట్టాయి. అయితే దీనికి ప్రధాన కారణం పెరిగిన టికెట్ల ధరలే. మరో వైపు ఓ టి టి లు తక్కువ ధరలతో బాగా ఆకర్షించడంతో అటు వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే టికెట్ల ధరలు పెంచినప్పటి నుండి టికెట్ల ధరలు తగ్గించాలని ఇరు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికపై ఇదే అంశం పై ఎన్నో విమర్శలు వినపడుతున్నాయి.
ఈ విషయం ఇన్నాళ్టికి ఒక కొలిక్కి వచ్చింది అని సమాచారం. అప్పట్లో టికెట్ల ధరలు పెంచాలని తెలుగు రాష్ట్రాల సిఎం లను కలిసి ఒప్పించిన మన టాలీవుడ్ అగ్ర హీరోలు, సినీ ప్రముఖులు ఇపుడు పరిస్థితులను అర్దం చేసుకుని భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని తాజాగా టికెట్ల ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారని త్వరలో ప్రకటించనున్నారు అని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న న్యూస్. పలు మార్లు టికెట్ల ధరలపై చర్చలు జరిపిన సినీ పెద్దలు ఇపుడు ఒక నిర్ణయానికి వచ్చి టికెట్ల ధరలను తగ్గించారని సమాచారం. సినిమాలను విజయవంతం చేయడంలో ఎంతో ముఖ్య పాత్రను పోషించే సామాన్య ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. రాబోయే సినిమాలకు ఎలాంటి టికెట్లు ధరలు పెంచకుండా ప్రతి సామాన్యుడు సినిమాను చూసుకోగలిగేలా టికెట్ల ధరలను తగ్గించాలని నిర్ణయించారట.