ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన సినిమా స్వాతి ముత్యం వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించింది. లక్ష్మణ్ కె దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందింది. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలతో పోటీ పడినప్పటికి క్లీన్ హిట్గా నిలిచింది. అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని థియేటర్లో మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తెర దించుతూ ఓటీటీ ప్లాట్ఫామ్ తాజాగా స్ట్రీమింగ్ డేట్ను ప్రకటించింది.ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా 'స్వాతి ముత్యం' స్ట్రీమింగ్ రైట్స్ను దక్కించుకుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈ చిత్రం అక్టోబర్ 28నుంచి స్ట్రీమింగ్ కానుందని 'ఆహా' గతంలో ప్రకటించింది. కానీ, ప్రేక్షకుల డిమాండ్ మేరకు సినిమాను ముందుగానే స్ట్రీమింగ్ చేయనున్నామని ఆహా తెలిపింది. 'స్వాతి ముత్యం' అక్టోబర్ 24నుంచి ప్రేక్షకులందరికి అందుబాటులో ఉండనుందని ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రకటనను జారీ చేసింది. స్వాతి ముత్యం కథ విషయానికి వస్తే.. బాల మురళీ కృష్ణ (బెల్లంకొండ గణేశ్) విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తుంటాడు. పసిపిల్లాడి వంటి స్వచ్ఛమైన మనసున్న కుర్రాడు. తల్లిదండ్రుల చాదస్తం కారణంగా పెళ్లి సంబంధం కుదరక ఇబ్బంది పడుతుంటాడు. స్కూల్ టీచర్ అయిన భాగ్యలక్ష్మి (వర్ష బొల్లమ్మ)ని పెళ్లి చూపుల్లో చూసి ప్రేమిస్తాడు. అనేక సమస్యలను దాటుకొని వారిప్రేమ.. పెళ్లి పీటల వరకు వస్తుంది. మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఓ యువతి తొమ్మిది నెలల బిడ్డను తీసుకొచ్చి 'నీ బాబే' అని హీరో చేతిలో పెడుతుంది. తన బిడ్డే అని హీరో కూడా అంగీకరిస్తాడు. ఇంతకీ ఆ యువతి ఎవరు? ఆ చిన్నారి నిజంగా బాల మురళీ కృష్ణకు పుట్టిన బిడ్డేనా? స్వాతి ముత్యం లాంటి బాల మురళీ కృష్ణ పెళ్లికి ముందే పిల్లల్ని ఎలా కన్నాడు? అనేది మిగతా కథ.