డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో మంచి గుర్తింపు పొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు. అంతేగాక సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు. దాదాపు 21 ఏళ్లుగా ఆమె సుస్వర మ్యూజిక్ అకాడమీ పేరిట ఘనంగా ప్రతి ఏటా వార్షికోత్సవ సంబరాలను జరుపుతున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం మే 5వ తేదీ ఆదివారం నాడు డల్లాస్ నగరంలో గ్రాండ్ సెంటర్ అనే ఆడిటోరియంలో సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవ సంబరాలను ఆకాశాన్ని తాకేలా జరిపారు. ఈ ఉత్సవానికి డల్లాస్ నగరంలోని ప్రముఖులతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అతిధులుగా హాజరయ్యారు.తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ శ్రీ ప్రసాద్ తోటకూర గారు, డల్లాస్ లో ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులుగా ముఖ్యపాత్రను పోషిస్తున్న శ్రీ గోపాల్ పోనంగి గారు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కిషోర్ కంచర్ల గారు, శ్రీమతి శారద సింగిరెడ్డి గారు ఇంకా అలాగే శ్రీ ప్రకాష్ రావు గారు అతిధులగా వచ్చారు.
ఇంకా టాలీవుడ్ నుంచి ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్. పి. పట్నాయక్ , టాలీవుడ్ డైరెక్టర్ వి. ఎన్. ఆదిత్య గార్లతో సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.ఈ వార్షిక సంబరాల్లో మీనాక్షి అనిపిండి గారు తన టీంతో 7 సిగ్మెంట్లలో దాదాపు 30కి పైగా సంప్రదాయ సంగీత కీర్తనల ప్రదర్శన ఇచ్చారు. 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సాంస్కృతిక గాన ప్రదర్శన ప్రేక్షకులందరినీ కుర్చీల్లో నుంచి కదలకుండా కట్టిపడేసింది. అలాగే సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షిక సంబరాల వేదిక పై, చంద్రబోస్ గారికి "సుస్వర సాహిత్య కళానిధి" అనే బిరుదుతో గౌరవించి సత్కరించారు. చంద్రబోస్ గారు తన స్వగ్రామం చల్లగరిగెలో తల పెట్టిన ఆస్కార్ గ్రంధాలయ నిర్మాణానికి, ఈ కార్యక్రమం ద్వారా 15 వేల డాలర్స్ కు పైగా విరాళం ఇవ్వడం మరొక విశేషం.
ఈ సంబరాల్లో టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్. పి. పట్నాయక్ గారు తన మాటలతో , పాటలతో ప్రేక్షకులందరినీ బాగా అలరించారు.అంతేగాక ఆయన్ని "సుస్వర నాదనిధి" ,అనే బిరుదుతో మీనాక్షి అనిపిండి గారు సత్కరించారు. ఇక సుస్వర మ్యూజిక్ అకాడమీ లోని విద్యార్థినీ, విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని బాగా జరిపించడం మెచ్చుకోదగ్గ విషయం.కుమారి సంహిత అనిపిండి, శ్రీమతి ప్రత్యూష తమ వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని ఆసక్తికరంగా చేశారు.