కలియుగ కల్కి పవన్ కల్యాణ్: నాగబాబు

Suma Kallamadi
పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ఇపుడు భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిన్న మొన్నటి వరకు కేవలం సినిమాల వరకే ఇరు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ అని వినబడిన పేరు ఇపుడు జనసేనలో దేశమంతటా వినబడుతోంది. ఇక మెగా కుటుంబం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం. మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో బిజీగా ఉంటే, తమ్ముడు నాగబాబు మాత్రం.. తమ్ముడు కళ్యాణ్ కి అండగా ఉంటున్నాడు. ఇక తాజాగా రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం విషయమై తిరుమల శ్రీవారి లడ్డూ మహాప్రసాదంలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈ సమయంలో జనసేన నేత నాగబాబు ఓ ఆసక్తికర పోస్ట్ పెడుతూ ఇండైరెక్టుగా పవన్ కళ్యాణ్ ని కలియుగంలో వెలసిన 11వ అవతారం కల్కిగా అభివర్ణించారు. కాగా తిరుమల లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్... సనాతన ధర్మం కోసం తాను నిలబడతానని.. అవసరమైతే ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధమని.. హిందువులంతా కలిసి రావాలని చెబుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేస్తున్నారు.
ఇందులో భాగంగా.. హిందూ ధర్మాన్ని అమితంగా నమ్మె కళ్యాణ్ బాబు తనతో చాలా కాలం క్రితం ఓ మాట అన్నారంటూ నాగబాబు ఓ పోస్ట్ రాసుకొచ్చారు. అదేమిటంటే... "హిందూ ధర్మాన్ని అమితంగా నమ్మే కళ్యాణ్ బాబు.. నాతో చాల కాలం ఓ మాట చెప్పారు! సత్య (కృత) యుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. త్రేతాయుగంలో 3 పాదాలతో ధర్మం నడవగా, ఒక భాగంలో అధర్మం నడిచింది. అలాగే ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాల మీద నడవగా, అధర్మం కూడా 2 పాదాల మీద నడిచింది. ఇక కలియుగం వచ్చేసరికి
అధర్మం 3 పాదాల మీద రంకెలు వేస్తే, ధర్మం కేవలం 1 పాదం మీద మాత్రమే నడుస్తుంది! అందుకే ధర్మం ఒక పాదం మీద నడిచినా బలంగా నడవడానికి నా వంతు పాత్ర పోషిస్తాను! నా ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాను!" అని కళ్యాణ్ బాబు నాతో అన్నాడు... అంటూ రాసుకొచ్చారు నాగబాబు. కాగా ఈ వ్యాఖలు చూసిన సగటు హిందువులు ఒకేతాటిపైకి వచ్చి... "పవన్ కళ్యాణ్ మనిషి కాదు... సనాతన ధర్మం కోసం అవతరించిన పవనుడు... కలియుగ కల్కి!" అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: