మళ్ళీ వార్తలలో బాహుబలి 3 !

Seetha Sailaja
‘బాహుబలి’ విడుదలై సంవత్సరాలు గడిచిపోతున్నా ఆసినిమా సృష్టించిన కలక్షన్స్ సునామి ఇండస్ట్రీ వర్గాలు మర్చిపోలేకపోతున్నాయి. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన ‘బాహుబలి’ తెలుగు సినిమా మార్కెట్ ను విపరీతంగా పెంచింది. రాజమౌళి నుండి ఈమూవీ తరువాత ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చినా ప్రేక్షకులు మాత్రం ‘బాహుబలి’ ని మర్చిపోలేక పోతున్నారు.

రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీకి మరొక సీక్వెల్ వచ్చి ‘బాహుబలి 3’ ఉంటే బాగుంటుంది అన్నకోరిక చాలమందిలో ఉంది. రాజమౌళి ఈసినిమాకు సీక్వెల్ ఉంటుందా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయినప్పటికీ ‘బాహుబలి 3’ పై వార్తలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా తాను నిర్మిస్తున్న ‘కంగువ’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బాహుబలి 3’ ఉంటుంది అని చెప్పిన మాటలు మీడియాకు సంచలనంగా మారాయి.

వాస్తవానికి రాజమౌళి మహేష్ బాబుతో తీస్తున్న భారీ మూవీ ప్రాజెక్ట్ పై తన దృష్టి అంతా పెట్టాడు. ఈమూవీ బడ్జెట్ సుమారు 800 కోట్లు ఉంటుంది అని వస్తున్న వార్తలను చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. వచ్చే జనవరి నుండి చిత్రీకరణ జరుపుకోబోతున్న ఈమూవీ పూర్తి అవడానికి కనీసం 2 సంవత్సరాలు పైగా సమయం పడుతుందని లీకులు వస్తున్నాయి.

దీనితో ఈమూవీ విడుదలై మళ్ళీ రాజమౌళి మరొక సినిమా గురించి ఆలోచన చేయాలి అంటే మూడు సంవత్సరాలు పైగా కాలం పట్టే అవకాశం ఉంది. ప్రభాస్ కూడ మరో మూడు సంవత్సరాల వరకు తాను చేస్తున్న సినిమాల రీత్యా బిజీగా ఉండబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య జ్ఞానవేల్ రాజా ‘బాహుబలి 3’ ప్రస్తావన ఎందుకు తెచ్చాడో ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది. దీనికితోడు ‘బాహుబలి 2’ లో రానా అతడి కొడుకు అడవిశేషు పాత్రలు ఇప్పటికే సినిమా కథలో చనిపోవడంతో ‘బాహుబలి 3’ లో విలన్ ఎవరు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: