తెలుగు సినిమా ర‌చ‌యిత చ‌నిపోతే ర‌ష్యా ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌ట‌న‌.. అంత గొప్ప వ్య‌క్తి ఎవ‌రంటే..?

RAMAKRISHNA S.S.
ఎవరైనా బతికి ఉన్నప్పుడు ఎంతోమంది స్నేహితులను కోరుకుంటారు. అలాగే చనిపోయిన తర్వాత కూడా అందరూ రావాలని కోరుకునే వారు కూడా ఉన్నారు. కొందరు మాత్రం.. ఎలాంటి చడీచప్పుడు చేయరు. వారు ఎలా ఈ భూమి మీదకు వచ్చారో.. అంతే నిశ్శబ్దంతో వెళ్ళిపోతూ ఉంటారు. కొందరు ఈ భూమి మీదకు వచ్చి.. చనిపోయి వెళ్లే లోపు ఎన్నో సంచలనాలకు కారణం అవుతూ ఉంటారు. శ్రీరామ జ‌య‌రామ‌.. సీతారామ‌.. అంటూ సాగే ముత్యాల‌ముగ్గులో పాట రాసిన, సాపాటు ఎటూ లేదు.. పాటైనా పాడు బ్ర‌ద‌ర్‌.. స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్ర‌ద‌ర్.. అని విరుద్ద భావాలు ఉన్న పాట‌లు రాసినా.. అది ఆయ‌న‌కు మాత్ర‌మే చెల్లింది.

ఆయ‌నే ఆరుద్ర‌. ఆయ‌న ర‌చ‌యిత‌గానే చాలా మందికి తెలుసు. కానీ.. న‌టుడిగా రెండు, మూడు సినిమాల్లోనూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. ఆరుద్ర అస‌లు పేరు భాగవతుల సదా శివశంకర శాస్త్రి. ఆయ‌న ఓ అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు కూడా. ఆయ‌న ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత కె.రామలక్ష్మితో ఆయ‌న జీవితాన్ని సాగించారు. క‌మ్యూనిస్టు ఉద్య‌మ భావాల‌ను పుణికి పుచ్చుకున్న ఆయ‌న‌.. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువు కు గుడ్ బై చెప్పారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గుమ్మస్తాగా పనిచేసి.. ఆ త‌ర్వాత‌ కొంతకాలం సంగీతంపై దృష్టిని పెట్టారు.

ఇక అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర.. ఆ సంస్థ అభివృద్ధికి చాలా చాలా కృషి చేశారు. ఆయ‌న మృతి చెందిన‌ప్పుడు కూడా ఆయ‌న కోరిక మేర‌కు ఆయ‌న స‌తీమ‌ణి రామ‌ల‌క్ష్మి ఎవ‌రికీ చెప్ప‌లేదు. నిజానికి హైద‌రాబాద్ న‌డిబొడ్డున చిక్క‌డ‌ప‌ల్లిలోనే నివాసం ఉన్నా.. అంత్య‌క్రియ‌లు పూర్త‌యి.. సాయంత్రం మీడియాకు ప్రెస్‌నోట్ రిలీజ్ అయ్యే వ‌ర‌కు ఎవ్వ‌రికి తెలియ‌దు. ఆయ‌న ఖ్యాతి తెలుగు సినిమా వ‌ర‌కే ప‌రిచ‌యం అనుకుంటే పొర‌పాటు.. ర‌ష్యాలో ఆయ‌న‌కు నివాళిగా.. ప్ర‌భుత్వం ఒక పూట సెల‌వు ప్ర‌క‌టించింది అంటే.. ఆయ‌న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: