మంచు మనోజ్ మరోసారి హెడ్లైన్స్ లో నిలిచాడు. ఆదివారం ఏలూరులో జరిగిన `భైరవం` సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తన ఏవి చూసి మనోజ్ కన్నీరు పెట్టుకోవడం అందర్నీ కదిలించింది. అలాగే స్టేజ్ పై మంచు మనోజ్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది. ఇటీవల తన ఫ్యామిలీతో చోటుచేసుకున్న విభేదాలను గుర్తు చేసుకోవడమే కాకుండా తొమ్మిదేళ్లు గ్యాప్ వచ్చిన అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమానురాగాలపై మనోజ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. భైరవం తో మళ్లీ తన ఫిల్మ్ జర్నీ స్టార్ట్ అవుతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనంతరం.. తాజాగా బడా బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్న టాలీవుడ్ హీరో నారా రోహిత్ మనోజ్ ను ఉద్దేశిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. `నిన్న ఏలూరులో భైరవం ఈవెంట్ లో అద్భుతమైన సాయంత్రం గడిపాను. ఈ ఈవెంట్ను ఎంతో ప్రత్యేకంగా మార్చినందుకు ఏలూరు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా బాబాయ్ మంచు మనోజ్ హైలెట్గా నిలిచాడు. ఆయన ప్రసంగం శక్తివంతమైనది, భావోద్వేగమైనది మరియు నిజంగా హృదయాన్ని కదిలించింది. ఏది ఏమైనా, నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటా బాబాయ్. లవ్ యూ!` అంటూ ఎక్స్ వేదికగా నారా రోహిత్ పోస్ట్ పెట్టాడు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

కాగా, భైరవం విషయానికి వస్తే.. ఇదొక మల్టీస్టారర్. ఈ విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఈ రస్టిక్ యాక్షన్ డ్రామాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించారు. అదితి శంకర్, ఆనంది, దివ్యా పిల్లై హీరోయిన్లుగా చేశారు. ఓ పురాతన గుడి, ధర్మం కోసం నిలబడే ముగ్గురు స్నేహితుల చుట్టూ భైరవం స్టోరీ సాగుతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. భైరవంతో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ ముగ్గురూ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ మరియు సినీ లవర్స్ ఆకాంక్షిస్తున్నారు.