`బలగం` మూవీతో కమెడియన్ నుంచి డైరెక్టర్ గా టర్న్ తీసుకున్నాడు వేణు యెల్దండి. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు.. తన సెకండ్ ప్రాజెక్ట్ గా `ఎల్లమ్మ`ను అనౌన్స్ చేశాడు. తెలంగాణ నేపథ్యంలో గ్రామ దేవతల చుట్టూ తిరిగే సోషల్ డ్రామా ఇది. అయితే ఈ ప్రాజెక్ట్ ఒక హీరో నుంచి ఒక హీరోకు చేతులు మారుతుంది తప్ప సెట్స్ పైకి వెళ్లడం లేదు. మొదట ఈ చిత్రాన్ని వేణు నాచురల్ స్టార్ నానితో చేయాలని భావించాడు. కథలోని కొత్తదనం, భావోద్వేగాలు నచ్చడంతో నాని కూడా ఓకే చెప్పాడు. షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనుకునే లోపే నాని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. లైన్ బాగున్నప్పటికీ ఫుల్ స్క్రిప్ట్ చదివాక నాని సంతృప్తి చెందలేకపోయాడు. ఆ కారణంగానే ఎల్లమ్మ నుంచి నాని అవుట్ అయినట్టు బలమైన టాక్ ఉంది.
నాని తర్వాత ఎల్లమ్మ నితిన్ వద్దకు వెళ్ళింది. నిర్మాతగా దిల్ రాజు సెట్ అయ్యారు. రేపో మాపో సినిమా ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. కానీ నితిన్ రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ మూటగట్టుకున్నాడు. కొద్దిరోజుల క్రితం విడుదలైన `తమ్ముడు` చిత్రం కూడా నితిన్ ను నిరాశపరిచింది. నితిన్ మార్కెట్ పూర్తిగా పడిపోవడంతో ఎల్లమ్మకు అతను కరెక్ట్ కాదని దిల్ రాజు భావిస్తున్నారట. నితిన్ సైతం ఎల్లమ్మను పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది.
ఇక నాని, నితిన్ ఔట్ అవ్వడంతో ఎల్లమ్మ ప్రాజెక్టులోకి మరో టాలీవుడ్ క్రేజీ హీరో ఎంటర్ అయినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు శర్వానంద్. ఫ్లాపుల మధ్యలోనే ఉన్న శర్వాకు మంచి మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు, వేణు రీసెంట్గా శర్వాను కలవడం.. ఎల్లమ్మ స్క్రిప్ట్ వినిపించడం.. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.