రాజమౌళి-మహేష్ 'వారణాసి' బడ్జెట్ లీక్: ప్రియాంక చోప్రా నోట సంచలన నిజం.. షేక్ అవుతున్న టాలీవుడ్!

Amruth kumar
దర్శకధీరుడు రాజమౌళి పేరు వినిపించిందంటే … అంచనాలు ఆకాశాన్ని తాకడం కామన్. ఇక ఆయనకు సూపర్ స్టార్ మహేష్ బాబు తోడైతే… ఆ సినిమా ఇండియన్ సినిమా హద్దులు దాటుతుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఆటోమేటిగ్గా ఏర్పడుతుంది. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో ఎవరూ ఊహించని స్థాయిలో… హాలీవుడ్ రేంజ్ విజువల్స్, టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండటం మరో భారీ హైలైట్. ఇప్పటికే హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ప్రియాంక… మళ్లీ భారతీయ ప్రేక్షకుల ముందుకు, అది కూడా రాజమౌళి సినిమాతో రావడం విశేషం. అయితే తాజాగా ఆమె చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది.

 

ఇటీవల ప్రసారమైన ‘ది కపిల్ శర్మ షో – సీజన్ 4’ లో పాల్గొన్న ప్రియాంక … ఇప్పటివరకు ఎక్కడా అధికారికంగా బయటకు రాని ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. అదేంటంటే … ‘వారణాసి’ సినిమా బడ్జెట్ ఏకంగా రూ. 1,300 కోట్లు! ఇది టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ సినిమా కావడం గమనార్హం. అంతేకాదు… రాజమౌళి కెరీర్‌లోనూ ఇదే అతిపెద్ద ప్రాజెక్ట్. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి సినిమాలతో వరల్డ్ వైడ్ మార్కెట్ ఓపెన్ చేసిన రాజమౌళి… ఇప్పుడు ‘వారణాసి’తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్నారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న భారతీయ చిత్రాలలో రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం పార్ట్ – 1’ ఉంది, దీని బడ్జెట్ రూ. 2,000 కోట్లకు పైగా ఉంటుందని టాక్. ‘వారణాసి’ ఒక ఫుల్ లెంగ్త్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.

 

కథ పరంగా, విజువల్స్ పరంగా… ఇది ఇండియన్ సినిమాలకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మహేష్ బాబు ఈ సినిమాలో ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. కథను విజయేంద్ర ప్రసాద్ అందిస్తుండగా, సంభాషణలు దేవా కట్టా రాస్తున్నారు. ఈ కాంబినేషన్ చూస్తేనే… ‘వారణాసి’ కేవలం సినిమా కాదు… ఒక గ్లోబల్ ఈవెంట్‌గా మారబోతోందని అర్థమవుతోంది. మొత్తానికి రాజమౌళి – మహేష్ బాబు – ప్రియాంక చోప్రా కలయికలో రూపొందుతున్న ఈ రూ. 1,300 కోట్ల మెగా ప్రాజెక్ట్… ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతుందన్న మాట!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: