ఆ సినిమా ధియేటర్స్ రిజల్ట్ చూసి..అమ్మ ఒడిలో తల పెట్టుకుని ఏడ్చిన త్రివిక్రమ్..!
అయితే, ఈ స్థాయికి చేరుకోవడం అంత సులభమైన ప్రయాణం కాదు. నేడు కనిపిస్తున్న ఘనవిజయాల వెనుక ఎన్నో అవమానాలు, అనుమానాలు, బాధాకరమైన అనుభవాలు దాగి ఉన్నాయి. అలాంటి అనుభవాల్లో ఒకటి ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా సందర్భంలో చోటు చేసుకుంది. 2001లో విక్టరీ వెంకటేష్ హీరోగా విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ప్రేమ, కుటుంబ విలువలు, స్వచ్ఛమైన హాస్యంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్గా మారిపోయింది. కాలం ఎంత గడిచినా ఈ సినిమాపై ప్రేక్షకుల అభిమానం తగ్గలేదు. అందుకే, ఈ చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, తాజాగా 4కె వెర్షన్లో జనవరి 1న మళ్లీ థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, ఈ సినిమా విడుదలైన రోజు తన జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ—“‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా విడుదలైన రోజే నేను నా సొంత ఊరు భీమవరం వెళ్లాను. అక్కడ ఓ థియేటర్ బయట నిలబడి, బయటకు వస్తున్న ఒక ప్రేక్షకుడిని సినిమా ఎలా ఉందని అడిగాను. అతడు పెద్దగా స్పందించకుండా, పెదవి విరుస్తూ— ‘రెండు మూడు వారాలు ఆడుతుందేమో’ అన్నాడు. ఆ మాట నా గుండెల్లో బలంగా గుచ్చుకుంది. ఆ ఒక్క మాట నా ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కుదిపేసింది. ‘నేను ఇక సినిమాలకు పనికిరానేమో, ఈ ఇండస్ట్రీకి రావడం నా జీవితంలో చేసిన పెద్ద తప్పేమో’ అనే భావన నన్ను చుట్టుముట్టింది. వెంటనే ఇంటికి వెళ్లి, నా తల్లి ఒడిలో తల పెట్టుకుని చిన్న పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాను. ‘ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుండేది, సినిమాల వైపు వచ్చి తప్పు చేశాను’ అని తీవ్రంగా అనిపించింది.”
అలాంటి పరిస్థితుల్లో త్రివిక్రమ్కు ధైర్యం ఇచ్చింది నిర్మాత స్రవంతి రవికిశోర్. ఆయన వెంటనే త్రివిక్రమ్కు ఫోన్ చేసి, “ఇప్పుడే హైదరాబాద్కు రా” అని పిలిచారు. త్రివిక్రమ్ హైదరాబాద్ చేరుకున్న తర్వాత, థియేటర్ల వద్ద ఉన్న జనసందోహాన్ని చూపించారు. టికెట్ల కోసం ప్రేక్షకులు పడుతున్న తపనను, సినిమా చూసేందుకు థియేటర్ల ముందు ఏర్పడిన రద్దీని చూసిన తర్వాతే త్రివిక్రమ్కు ఊపిరి పీల్చుకున్న భావన కలిగిందని తెలిపారు. రూ. 7 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన తర్వాత సంచలన విజయాన్ని సాధించింది. మొత్తంగా రూ. 18 కోట్ల షేర్ వసూలు చేసి, అప్పట్లో ఒక ప్రభంజనంలా దూసుకెళ్లింది. వాణిజ్యపరంగా మాత్రమే కాదు, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ముఖ్యంగా త్రివిక్రమ్ రాసిన సంభాషణలు, కథనం, పాత్రల చిత్రణ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.