శంకర వరప్రసాద్ గారు: చిరు చించేశారంటూ అల్లు అర‌వింద్ రివ్యూ ..!

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన అత్యంత ప్రతిష్టాత్మక సినిమా “మన శంకర వరప్రసాద్ గారు” సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. మాస్ సినిమాలను, వినోదాన్ని పక్కాగా మేళవించే దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన తొలి ఆట నుంచే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అభిమానులు ఆశించిన విధంగానే చిరంజీవి తన వింటేజ్ లుక్‌తో, ఎనర్జీతో వెండితెరపై మాయాజాలం సృష్టించారు. థియేటర్ల వద్ద మెగా అభిమానుల కోలాహలం చూస్తుంటే పండుగ వాతావరణం ముందే వచ్చినట్లు కనిపిస్తోంది.


ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ సినిమాను వీక్షించి తన స్పందనను తెలియజేశారు. సినిమా చూసిన అనంతరం ఆయన ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ మెగాస్టార్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. “బాస్ ఈ సినిమాలో చించేశారు.. ఇందులో నాకు వింటేజ్ రౌడీ అల్లుడు స్వాగ్ స్పష్టంగా కనిపించింది” అంటూ ఆయన కితాబు ఇచ్చారు. అంతేకాకుండా, చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘ఘరానా మొగుడు’ కాలం నాటి వైబ్స్ మళ్ళీ ఈ సినిమాలో కనిపిస్తున్నాయని అరవింద్ పేర్కొనడం విశేషం. మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఎంతో ఎనర్జిటిక్‌గా ఉన్నాయని ఆయన విశ్లేషించారు.


అల్లు అరవింద్ ఇంకా మాట్లాడుతూ.. ఈ సినిమాతో మెగా అభిమానుల ఆకలి తీరిందని సంతోషం వ్యక్తం చేశారు. అనిల్ రావిపూడి చిరంజీవిని ఎలా చూపించాలో అలాగే చూపించారని, అది ప్రేక్షకులకు ఒక పసందైన విందు అని కొనియాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అల్లు అరవింద్ వంటి అగ్ర నిర్మాత నుండి ఇలాంటి సమీక్ష రావడం సినిమా విజయంపై మరింత నమ్మకాన్ని పెంచింది. కేవలం అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్షకులు కూడా చిరంజీవి కామెడీ టైమింగ్‌కు, డ్యాన్స్‌లకు ఫిదా అవుతున్నారు. వింటేజ్ బాస్ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: