"ఒకవేళ నయనతార ఈ సినిమా ఒప్పుకోకపోతే ఏం చేసుండేవారు".. అనిల్ రావిపూడి స్టన్నింగ్ ఆన్సర్..!
అనంతరం నయనతారను ఈ సినిమాలో నటించమని కోరినప్పుడు, నిర్మాత సాహు గారపాటి అలాగే సుస్మిత కూడా కలిసి ఆమెతో మాట్లాడారని తెలిపారు. కథ మొత్తం వినిన తర్వాత నయనతార స్పందన చాలా స్పష్టంగా ఉందని అనిల్ రావిపూడి గుర్తు చేసుకున్నారు. “కథ నాకు చాలా నచ్చింది. చిరంజీవి గారితో సినిమా చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. అందులో వెంకటేష్ గారు కూడా ఉన్నారు. కానీ కొన్ని టెక్నికల్ విషయాలు కుదరడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఒకవేళ నేను ఈ సినిమా చేయను అని చెబితే నువ్వేం చేస్తావు?” అని నయనతార నన్ను అడిగారని ఆయన తెలిపారు.అప్పుడు తాను ఇచ్చిన సమాధానమే పరిస్థితిని పూర్తిగా మార్చేసిందని అనిల్ రావిపూడి చెప్పారు. “మీరు వెంకటేష్ గారి ‘దృశ్యం’ సినిమా చూశారు కదా. అందులో కథలో జరిగే విధంగా, ఈరోజు నేను నయనతార గారికి ఫోన్ చేయలేదు, ఆమెకు కథ చెప్పలేదు అని భావించుకుని ప్రశాంతంగా పడుకుంటాను” అని తాను చెప్పానని వెల్లడించారు.
ఈ సమాధానం విన్న వెంటనే నయనతార కొద్దిసేపు నవ్వారని, ఆ తర్వాతే అసలు నిర్ణయం చెప్పారని ఆయన తెలిపారు. “మనం ఈ సినిమా చేస్తున్నాం. ఆ టెక్నికల్ ఇష్యూస్ ఎలా క్లియర్ చేసుకుంటావో చేసుకో” అని ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. కథ నచ్చడం, పాత్రపై నమ్మకం కలగడం వల్లే నయనతార ఈ సినిమా చేయడానికి అంగీకరించారని స్పష్టం చేశారు.అంతేకాదు, ప్రమోషన్ల విషయంలో కూడా నయనతార సహకారం ఎంతో కీలకమైందని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. తాను చెప్పిన విధానం, సినిమాపై ఉన్న నమ్మకం, పాత్ర ప్రాధాన్యం నచ్చడంతోనే ఆమె ప్రమోషన్లకు ముందుకు వచ్చారని తెలిపారు. ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని, ఒక దర్శకుడిగా చాలా సంతోషంగా అనిపించిందని ఆయన చెప్పారు.
ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రశ్నలు, అనిల్ రావిపూడి సమాధానాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. మొత్తంగా ఈ సినిమా విజయం వెనుక ఉన్న కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరుగుతోంది.