ప్రభాస్ అంటే కేవలం హీరో కాదు.. బాక్సాఫీస్ సునామీ! ‘ఫౌజీ’ క్రేజీ అప్‌డేట్

Amruth kumar
ప్రభాస్ అంటే కేవలం ఒక హీరో కాదు.. బాక్సాఫీస్ వద్ద ఒక సునామీ! ఆయన సినిమా వస్తుందంటే చాలు ఇండియన్ సినిమా లెక్కలన్నీ తలకిందులు అవుతాయి. 'సీతా రామం' వంటి క్లాసిక్ హిట్‌ను అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ అత్యంత వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రాబోయే నెలల్లో మరిన్ని కీలక షెడ్యూల్స్ జరుపుకోనుంది.ప్రస్తుతం ప్రభాస్ తన ఇతర కమిట్‌మెంట్స్ పూర్తి చేయడంలో బిజీగా ఉండగా, 'ఫౌజీ' కొత్త షెడ్యూల్ మార్చి నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ చాలా కీలకం. ప్రభాస్ పాత్రకు సంబంధించిన ప్రధాన సన్నివేశాలు, భారీ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ ఈ షెడ్యూల్‌లోనే ప్లాన్ చేశారు. ఇంకా కేవలం 60 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, అందులో ప్రభాస్ కాల్షీట్లు మరో 35 రోజుల వరకు అవసరమవుతాయని సమాచారం. అంటే సమ్మర్ ముగిసేలోపు ఈ విజువల్ వండర్ షూటింగ్ దాదాపు కొలిక్కి రానుంది.



ఈ సినిమా కథ స్వాతంత్ర్యానికి పూర్వపు రోజుల్లో (Pre-Independence Era) సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా. ఇందులో ప్రభాస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా కనిపిస్తారని టాక్. టైటిల్ గ్లింప్స్‌లో చూపించిన ఆ ఇంటెన్సిటీ చూస్తుంటే, హను రాఘవపూడి తనదైన మార్క్ ఎమోషన్స్‌ను ప్రభాస్ మాస్ ఇమేజ్ కు జోడించి ఏదో పెద్ద మ్యాజిక్కే చేస్తున్నారని అర్థమవుతోంది. సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతుండటం మరో విశేషం.మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సుమారు ₹400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే కథ కాబట్టి, ఈ సినిమాను 2026 స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) కానుకగా విడుదల చేయాలని మేకర్స్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఆ వీకెండ్‌లో ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ సినిమా పడితే, బాక్సాఫీస్ రికార్డులు ఏ రేంజ్ లో గల్లంతవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


'ఫౌజీ' చిత్రానికి సంబంధించి ఫిలిం నగర్ లో మరో క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ కథ చాలా పెద్దది కావడంతో, దీనికి ఒక ప్రీక్వెల్ కూడా చేసే ఆలోచనలో టీమ్ ఉందట. ఒకవేళ ఇదే నిజమైతే, 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నుంచి మరో అద్భుతమైన ఫ్రాంచైజీ రాబోతోందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మిథున్ చక్రవర్తి, జయప్రద వంటి వెటరన్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తుండటం ఈ సినిమాకు మరింత వెయిట్ తెచ్చింది.మొత్తానికి మార్చిలో ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్‌తో 'ఫౌజీ' జైత్రయాత్ర నెక్స్ట్ లెవల్‌కు వెళ్లనుంది. హను రాఘవపూడి క్లాసిక్ మేకింగ్, ప్రభాస్ మాస్ అప్పీల్ కలిస్తే వచ్చే ఆ కిక్కే వేరు. 2026 ఆగస్టులో థియేటర్లు గర్జిస్తాయని, 'ఫౌజీ' చరిత్ర సృష్టిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడే కాలర్ ఎగరేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: