బుకింగ్స్లో రికార్డులు బ్రేక్ చేసిన బాస్.. మన శంకర వర ప్రసాద్ నయా రికార్డ్.. !
కేవలం వసూళ్లలోనే కాకుండా టికెట్ విక్రయాల్లో కూడా ఈ మూవీ అరుదైన మైలురాళ్లను అధిగమిస్తోంది. ప్రముఖ టికెటింగ్ యాప్స్ బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్లో కలిపి ఇప్పటివరకు 52 లక్షల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఈ స్థాయిలో టికెట్ల అమ్మకాలు జరగడం ప్రాంతీయ సినిమాల్లో ఒక అరుదైన రికార్డు అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మెగాస్టార్ మ్యానరిజమ్స్, అనిల్ రావిపూడి మార్కు కామెడీ టైమింగ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. చిరంజీవి తన అసలు పేరుతోనే ఈ పాత్ర చేయడం అభిమానులకు మరింత కిక్కు ఇస్తోంది.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ పోషించిన ప్రత్యేక పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మెగాస్టార్, వెంకీ మామ స్క్రీన్ షేర్ చేసుకోవడం చూసి నందమూరి, మెగా అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. కథానాయికగా నయనతార తన నటనతో సినిమాకు నిండుదనం తీసుకువచ్చారు. భీమ్స్ సిసిరోలియో అందించిన జానపద బాణీలు, నేపథ్య సంగీతం థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. కుటుంబ కథా చిత్రాలకు మాస్ ఎలిమెంట్స్ తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ చిత్రం నిరూపిస్తోంది.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవి కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి దూసుకుపోతుండటంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా పండగ చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లు సాధించి సౌత్ ఇండియాలోనే టాప్ గ్రాసర్స్ జాబితాలో చేరే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.