సురేందర్ రెడ్డి స్కెచ్ అదిరింది.. పవన్ మూవీపై అంచనాలు పీక్స్!
సాధారణంగా సినిమాల ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ హైదరాబాద్లోనే జరుగుతాయి. కానీ, ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాధ్యతల్లో బిజీగా ఉండటం, ఎక్కువగా విజయవాడలోనే అందుబాటులో ఉంటుండటంతో.. సురేందర్ రెడ్డి తన ఆఫీసును విజయవాడకే షిఫ్ట్ చేశారు. అక్కడే స్క్రిప్ట్ చర్చలు, ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పవన్కు అందుబాటులో ఉంటూ, ప్రతి సన్నివేశాన్ని ఆయన ఇమేజ్కు తగ్గట్టుగా చెక్కుతున్నారు సురేందర్ రెడ్డి.
'అతనొక్కడే' నుంచి 'సైరా' వరకు సురేందర్ రెడ్డి మేకింగ్లో ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ముఖ్యంగా హీరోలను ఎంతో స్టైలిష్గా, ఎనర్జిటిక్గా చూపించడంలో ఆయన దిట్ట. ‘ఏజెంట్’ ఫలితం ఎలా ఉన్నా, పవన్ కళ్యాణ్ సినిమాతో మళ్ళీ తన పవరేంటో బాక్సాఫీస్ వద్ద నిరూపించుకోవాలని ఆయన కసితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా కోరుకుంటున్న వింటేజ్ లుక్ మరియు ఎనర్జీని ఈ సినిమాలో చూపించేందుకు పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్నారు.
గతేడాది ‘ఓజీ’తో బాక్సాఫీస్ను షేక్ చేసిన పవన్ కళ్యాణ్, ఇటీవల ‘ఉస్తాద్ భగత్సింగ్’తో తన మేనియా ఏంటో చూపించారు. ఇప్పుడు సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ను కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజకీయ బాధ్యతలను నిర్వహిస్తూనే, ప్రేక్షకులను అలరించడానికి సమయం కేటాయిస్తున్నారు. విజయవాడ కేంద్రంగా జరుగుతున్న ఈ పనులు పూర్తయిన వెంటనే, ఈ సినిమా షూటింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.పవర్ స్టార్ మాస్ పవర్.. సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్.. ఈ రెండు కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం గ్యారెంటీ. విజయవాడ ఆఫీస్ నుంచి వచ్చే ఆ క్రేజీ అప్డేట్ కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ గర్జన వినడానికి గెట్ రెడీ!