చిరంజీవి తొలి సినిమా ప్రాణం ఖరీదు విడుదలై నేటికి 41 ఏళ్లు. 1978 సెప్టెంబర్ 22న విడుదలైన ఈ చిత్రంలో నరసయ్యగా ఆయన నటించారు. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన చిరు.. అనతికాలంలోనే నెం1గా ఎదిగాడు. తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్తో ఇండస్ట్రీని రఫ్పాడించారు. 1980, 90లలో ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చాడు. నిజంగా అది చిరు యుగం అనడంలో అతిశయోక్తి లేదేమీ. అంతగా యువతను, ఫ్యామిలీ ఆడియన్స్ను చిరు అలరించారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో ఇవాళ సా.6 గంటలకు జరగనుంది. అటు చిరు మరో చిత్రం త్రినేత్రుడు 1988లో సెప్టెంబర్ 22న విడుదల కాగా.. అదే సెప్టెంబర్ 22న సైరా ప్రీ - రిలీజ్ ఫంక్షన్ జరుగుతుండటం విశేషం. ఇకపోతే 18వ తారీఖున జరగవలసిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజుకు వాయిదా పడగా ఈ రోజుకూడా ఎందువల్లనో వాతావరణం అంతగా అనుకూలించడంలేదు. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ చిత్రానికి మొదటినుంచీ అన్నీ ఆటంకాలే ఎదరవుతున్నాయి. అలాగే ఉయ్యాల వాడ వారి కుటుంబీకులకు చిరంజీవి, రామ్చరణ్ అన్యాయం చేశారన్న వాదన కూడా మరో పక్కన వినిపిస్తోంది. సైరా సినిమాపై ఇప్పుడున్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బాహుబలి తర్వాత ఆ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వాడుకుంటూ వస్తున్న పీరియాడికల్ విజువల్ ఎంటర్టైనర్ సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్లో కూడా జోరు పెంచేస్తున్నారు టీం. దీనికి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ రానున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ కూడా బాబాయ్కు ప్రత్యేక ఆహ్వానం పంపించాడు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. దీనికి మెగా కుటుంబ సభ్యులు అంతా హాజరు కాబోతున్నారు. వరుణ్ తేజ్, బన్నీ, సాయి తేజ్, శిరీష్ లాంటి హీరోలంతా ఈ వేడుకకు వస్తున్నారు.