బాలీవుడ్లో మరో కరోనా కలకలం మొదలైంది. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కరోనా పాజిటివ్ అంటూ బయట పడటంతో బాలీవుడ్ అంతా ఒకేసారి ఉలిక్కి పడింది. ఆమె ఎంతో ప్రముఖులను కలవటంతో అంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తాజాగా మరో సారి అలాంటి పరిస్థితే బాలీవుడ్ లో నెలకొంది.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరాని తాజాగా ఓ సంచలన ప్రకటన చేశాడు. తన కూతురు షాజా మొరానీకి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా ప్రకటించాడు కరిమ్. ఇటీవల షాజా, శ్రీలంక నుంచి ముంబై వచ్చింది. అయితే మార్చి తొలి వారంలో వచ్చిన ఆమెకు మొదట్లో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు.
కానీ రాజస్థాన్ నుంచి వచ్చిన షాజా సోదరి జోయకు కాస్త కరోనా లక్షణాలు కనిపించటంతో వారిద్దరు టెస్ట్ చేయించుకున్నారు. అయితే అనుమానం వచ్చిన జోయాకు కరోనా టెస్ట్ లో నెగెటివ్ వచ్చినా ఎలాంటి లక్షణాలు లేని షాజాకు మాత్రం కరోనాకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది అని వెల్లడించారు.
మోరానీ 1991లో రిలీజ్ అయిన యోధా సినిమాతో నిర్మాతగా బాలీవుడ్కు పరిచయమయ్యాడు. షారూఖ్కు అత్యంత సన్నిహితుడైన ఆయన రా ఒన్, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, దిల్ వాలే లాంటి షారూఖ్ సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరించాడు.