ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్‌ కన్నుమూత

Edari Rama Krishna
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్(85) కన్నుమూశారు.   కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొన్నిరోజులుగా వెంటిలేటర్‌పై ఉండి చికిత్స పొందారు. 1932 డిసెంబర్ 28న మట్టెవాడలో వేణుమాధవ్ జన్మించారు. 1947లో పదహారేళ్లకే నేరెళ్ల తన కెరీర్‌‌ను ప్రారంభించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, ఉర్దూ, తమిళంలో ఆయన ప్రదర్శనలు చేశారు. దేశవిదేశాల్లో నేరెళ్ల వేణుమాధవ్ చేసిన ప్రదర్శనలు ఎంతో పేరుతెచ్చిపెట్టాయి. కళారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఇటీవల ఆయన పేరుతో పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేసింది. 


2001లో పద్మశ్రీ పురస్కారం ఆయనను వరించింది. శ్రీరాజలక్ష్మి ఫౌండేషన్‌ అవార్డునూ ఆయన అందుకున్నారు. ఆయన మృతిపై సర్వత్రా సంతాపం వ్యక్తమవుతోంది.ఆయన స్టేజ్‌పై ప్రదర్శించిన ఆనేక కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ నేతలు, సినీ తారలు, ఇతర ఆర్టిస్టులను ఆయన తన మిమిక్రీతో అనుకరించిన తీరు అందర్నీ ఆకట్టుకునేది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ హీరోలను అనుకరించడంలో నేరెళ్ల‌ వేణుమాధవ్ దిట్ట. 1972 నుంచి 1978 వరకు వేణుమాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు.  


ప్రముఖ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్‌ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేరెళ్ల వేణుమాధవ్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: