కోలీవుడ్ సుప్రీమ్ హీరో, సమత్తువ మక్కల్ కట్చికి వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే శరత్ కుమార్ పై ప్రస్తుత నడిగర్ సంఘం సభ్యులు పూచ్చి మురగాన్, కర్తిలు చెన్నై పోలీస్ కమీషనర్ కి ఫిర్యాదు చేశారు. నడిగర్ సంఘం (దక్షిణ భారత నటీనటుల సంఘం) భూముల విక్రయం కేసులో శరత్ కుమార్, నటుడు రాధారవి, మరో ఇద్దరిపై కాంచీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, నడిగర్ సంఘం భూములను అక్రమంగా విక్రయించారనే ఆరోపణలపై నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గతంలో నడిగర్ సంఘం అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. అంతే కాదు శరత్ కుమార్ పై పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.
తాజాగా నడిగర్ సంఘానికి శరత్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో సంఘం ట్రస్టులో భారీ అక్రమాలు జరిగాయని ఆయన ఎన్నో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని బాధితులు పోలీస్ కమిషనర్ ను కోరారు. నడిగర్ సంఘం ఆయనపై ఫిర్యాదు చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో శరత్ కుమార్ పై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంమైంది.
మరోవైపు శరత్ కుమార్ ఇమేజ్ దెబ్బ తీయడానికి కొంత మంది కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని..వాటన్నింటికి సమాధాన చెబుతామని ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు అంటున్నారు.