ఈ భూమిపై నవరసాలు ఒకేసారి కురిపించగల ఎస్వీఆర్ లాంటి మరో నటుడెవరైనా ఉన్నారా?
నవరసాలను ఒకే సమయంలో పలికించగల అనన్య సామాన్య నటసార్వ భౌముడు ఎస్వీ రంగారావు. ఆయన ఖర్మ కొద్దీ ఆయన మనదేశంలో- దురదృష్టం కొద్దీ తెలుగువాడై పుట్టాడు. అదే ఆయన అదృష్టం బాగుండి ఉంటే, ఏదో పాశ్చాత్య దేశాల్లో పుట్టి ఉంటే ప్రపంచలోనే అత్యున్నత ఐదుగురు నటుల్లో ఖచ్చితంగా ఒకరై గుర్తించబడే వారని మరో ప్రఖ్యాత నటుడు గుమ్మడి వేంకటేశ్వరరావు ఒక సందర్బంలో యశశ్వీ ఎస్వీ రంగారావు గుఱించి చెప్పిన మణిపూస లాంటి మాట. మన అదృష్టం కొద్దీ ఆయన మన వాడయ్యాడు.
విశ్వనటచక్రవర్తి, నటసార్వభౌమ, నటసింహ ఎస్వీ రంగారావు ప్రతిభను గురించి, వైవిధ్యమైన పాత్రల పోషించగల నైపుణ్యం గురించి ప్రసిద్ధ దర్శకుడు చిత్రకారుడు బాపు వేసిన చిత్రానికి ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ ఇలా చమత్కారంగా వాఖ్యానం వ్రాశారు.
క్లిష్టపాత్రల్లో చతురంగారావు
దుష్టపాత్రల్లో క్రూరంగారావు
హడలగొట్టే భయంకరంగారావు
హాయిగొలిపే టింగురంగారావు
రొమాన్సులో పూలరంగారావు
నిర్మాతల కొంగుబంగారావు
స్వభావానికి 'ఉంగారంగారావు
కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు
ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు
సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు నట యశస్విగా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు 300 చిత్రాల కు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా పౌరాణిక ప్రాశస్త్యమైన పాత్రలకు జీవం పోశారు. నటించకపోయి ఉంటే ఆ పాత్రలకే అంత పేరు ప్రతిష్ట తెచ్చి ఘటోత్కచుడి, కీచకుడి, రావణాసురుడికి ఈ యుగంలో నటించి ఆ పాత్రలకు ఒక రూపం ఇచ్చారు.
ఆ పాత్రల్లో ఆయన్ని చూసిన ఈ సకల ఆంధ్రజనులే కాదు, భారతజాతి యావత్తు మురిసిపోయింది. మరెవరూ ఆ పాత్రల్లో ఆయన్ని మరిపించలేక పోయారు పద్మశ్రీ నందమూరి తారక రామారావు తో సహా. తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పొయ్యరంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడలేక పొయ్యారు.
బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. తన తొలి సినిమాలో పాత్ర పోషించి నందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు. ఆ రోజుల్లో అత్యంత అధిక పారితోషికం అది. ఆ తర్వాత మనదేశం, పల్లెటూరి పిల్ల, షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనా చాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు.
నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తా లో ఆఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవములో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకు గాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమనటుడుగా బహుమతి పొందాడు. అదే పాత్రకు భారత రాష్ట్రపతి అవార్డు అందు కున్నాడు.
వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వర రావు.
యస్వీఆర్ ఒక రకమయిన వేదాంతి. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్క లేనన్ని విరాళాలు ఇచ్చాడు. చైనా తో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు. తర్వాత పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చాడు.
యశస్వీ ఎస్వీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా ఇండియా హెరాల్డ్ ఆ మహనీయునికి సవినయంగా నివాళులు సమర్పించుకుంటోంది