మహాభారత యుద్ధంకు సన్నిద్ధం అవుతూ అప్పట్లో పాండవులు దుర్గాదేవికి పూజలు చేసి జమ్మి చెట్టు మీద నుంచి తమ ఆయుధాలను తీసి కురుక్షేత్ర సంగ్రామానికి శ్రీకారం చుట్టారు. దేవి శరన్నవరాత్రుల రోజులలో దుర్గా ఆరాధన చేసిన పవన్ కళ్యాణ్ రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణరంగం కోసం తన వద్ద ఉన్న ఆయుధాలను జమ్మి చెట్టు మీద నుంచి తీసి రాబోతున్న ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధం అవుతున్నాను అంటూ కామెంట్స్ చేసి పవన్ తనకు తానుగా తన పై పురాణ పాత్రలను ఆపాదించు కున్నాడు.
ఆశ్చర్యకరమైన ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఆ జిల్లాలోని తితలీ తుఫాన్ బాధితులను పరామర్శిస్తూ పవన్ ఈ కామెంట్స్ చేసాడు. శ్రీకాకుళం జిల్లా తుఫాను బాధితులను పక్కకు పెట్టి పవన్ కవాతు ప్రదర్శనలు చేసిన నేపధ్యంలో అతడి పై విపరీతమైన విమర్శలు రావడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కూలిన తోటలను పరిశీలిస్తూ బాధితులకు తన సానుబూతిని ప్రకటిస్తున్నారు.
ఈ తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి అని అంటూ అక్కడి ప్రజలకు అక్కడి ప్రజలకు 25కిలోల బియ్యం సరిపోవు పంట పాడై వారి జీవితాలు 25ఏళ్ల వెనక్కి వెళ్లాయి అంటూ సానుభూతి చూపిస్తున్న పవన్ కనీసం వారిని ఆదుకోమని తన అభిమానులకు కూడ పిలుపు ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రభుత్వ కార్యక్రమాలను విమర్శించేందుకు తాను రాలేదు అంటూ ప్రజా సమస్యలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు తాను వచ్చాను అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు.
2009 ఎన్నికలలో కొంతమంది మోసం వల్ల అప్పట్లో తాము ఓడిపోయామని అయితే రాబోతున్న 2019 ఎన్నికలలో విజయం సాధించడానికి జమ్మిచెట్టుపై నుంచి ఆయుధాలు తీశాను అంటూ పవన్ ఆవేసపూరితంగా కామెంట్ చేసాడు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా పవన్ ను రాబోతున్న ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో నడిపించే కృష్ణుడు ఎవరు అన్నది సస్పెన్స్..