'ఎన్టీఆర్-మహానాయకుడు' ఎలాఉండబోతోంది? విద్యా బాలన్ నటన సినిమాకే హైలైట్

ఎన్టీఆర్ - కథానాయకుడు అసంపూర్ణ చిత్రం. నందమూరి తారక రామారావు చాయలు కనిపించినా ఆ కీలక పాత్రలో నటించిన బాలకృష్ణ నటన ఆ స్థాయిలో లేదు. సంభాషణలు ముఖ్యంగా ‘దాన వీర శూర కర్ణ’ చెందిన వాటిని ఒరిజినల్ వాటినే వాడేశారు. అంటే బాలకృష్ణ డయలాగ్ డెలివరీపై దర్శకుడు క్రిష్ విశ్వాసంలేకే ‘డివిఎస్ కర్ణ’ లోని ఎన్టీఆర్ సంభాషణలను యథాతతంగా వాడేశారు. 

ఈ సినిమాలో చెప్పాలంటే విద్యాబాలన్ నటన అద్భుతం అమోఘం తారస్థాయిలో ఉందని చెప్పవచ్చు. నిజ జీవిత పాత్రకే విలువలు అద్ధిన విద్యాబాలన్ నటన అనితరసాధ్యం అనలేక పోయినా నాటి సావిత్రి, జమున లాంటి కథానాయికలకు ఏమాత్రం తీసిపోదు అని ఘంటాపదంగా చెప్పొచ్చు. అలాగే నాగిరెడ్డి, చక్రపాణి, కెవీరెడ్డి పాత్రలను ప్రకాష్ రాజ్,  మురళి శర్మ,  క్రిష్ లు బింబ — ప్రతిబింబాలు గా దించేశారని చెప్పాలి.

ఎన్టీఆర్ ఆ స్థాయి ప్రతినాయకుడుగా ఎదగడానికి కారణం చిత్రసీమలో ఆయనకు పోటీ యిచ్చిన యశస్వి ఎస్వీ రంగారావు.  నర్తనశాలలొ కీచక పాత్రలో ప్రదర్శించిన నటనా వైదుష్యా నికి గాను జకార్తాలో జరిగిన “మూడవ ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్” ఆ విశ్వ నట చక్రవర్తిని ఉత్తమ నటుడు అవార్డ్ ఇచ్చి 1957 లోనే సత్కరించింది.  ఆ స్థాయి అవార్డ్ అందు కున్న తొలి భారతీయుడు ఎస్వి రంగారావు మాత్రమే.  మాయాబజార్ లో ఎస్వీఆర్ నటన అనితర సాధ్యం అంటారు.

పాండవ వనవాసం సినిమాలో భీముడుగా ఎన్టీఆర్ భీకర, గంభీర, సంస్కృత పద ప్రయోగంతో,  ధారుణి రాజ్య సంపద...కురువృద్దుల్ కురువృద్ద భాందవుల్…. అంటూ గొంతు చించేసు కున్న డయలాగ్ లను ధిక్!..... బానిసలకు ఇంత అహంకారమా! అంటూ ముఖం పైనే వికృత హావభావాల తోనే చీత్కరింపు నటనతో ఎన్టీఆర్ ను తొక్కేసిన చరిత్ర  ఎస్వీఆర్  కు ఉంది.  అంతటి నటుణ్ణి ప్రాముఖ్యత లేకుండా సినిమాలో వదిలేశారు.

ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాత్రలో సహధర్మచారిణి పట్ల చిలిపితనాన్ని పదునెక్కించిన ఆధునిక సత్యభామగా జమున నటన సైతం ఎన్టీఆర్ ను "ఢీ" కొట్టింది. ఈ సినిమాలో లేశమాత్రం 
కూడా జమునను చూపలేదు. దీనికి కారణం ఏమనాలి?  ఇలా ఈ బయోపిక్ సినిమాలోనే ఆయనను, ఆయన నటనను ప్రభావితం చేసిన పాత్రలను లేశ మాత్రం కనిపించనివ్వ కుండా దాచేసి అణచివేసిన చరిత్ర ఉన్నవారు, నిజ జీవితంలో వారిని ప్రభావితం చేసిన వారిని బహుశ అణచివేసి ఉంటారనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఎంతసేపటికీ సినిమా అంతా ఎన్టీఆర్ ని మంచివాడుగా, నిష్కళంకుడుగా, మహనీయుడిగా, మహిమాన్వితుడుగా  చూపటానికి ప్రయత్నించేవారు సజీవ జీవన చిత్రాలు అంటే బయోపిక్ లను నిర్మించటానికి అనర్హులు - బహుశ ఏవరి ప్రభావానికో లొంగిపోయి జాగర్లమూడి క్రిష్ కొన్నిపాత్రలకు అన్యాయం చేశారు. అందులో ఎన్ టీఆర్ 'నట-జీవితం' లో కీలక పాత్ర దేవిక ను చూపనే లేదు. ఎన్టీఆర్ తో అసాధారణ సంబంధాలున్నాయని నాడు ప్రచారంలో ఉన్న కృష్ణకుమారి పాత్రను ఊరకే తేల్చేసారు. 

ఇక మంచి నటి, నటనా చాతుర్యం ఉన్న నిత్య మీనన్ సావిత్రి పాత్రలొ ఇమిడి పోలేదు. "రాజును చూసిన కళ్ళకు మొగుణ్ణి చూసి మొట్ట బుద్దైంది " అన్న సామెతలా "మహానటి సినిమాలో  కీర్తి సురెష్ — స్థాయికి ఆమె సూట్ కాలేదు అనటం అతిశయోక్తి కాదు.  మహానటి సినిమాలో సావిత్రి పాత్రని చిత్రీకరించిన స్థాయిలో (పోర్ట్రే చేసిన తీరు) - ఎన్ టీఆర్ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్రను చిత్రీకరించేదు అని నిర్ద్వంధంగా చెప్పవచ్చు. ఇది నిర్వివాదాంశం.

దర్శకునికి స్వతంత్రం లేకపోయుండవచ్చు. ఈ సంఘట్టన ఈ సినిమా తొలిదర్శకుడు "తేజ" ను తప్పించటంలోని ఔచిత్యం బహిర్గతం చేస్తూనే ఉంది. కీలక ఎన్టీఆర్ పాత్రకు బాలకృష్ణ ఏ మాత్రం సరిపోలేదు. దానికి సరైన నటుడు తారక్ ను వదిలేసి ఎన్టీఆర్ బయోపిక్ కు అన్యాయం  చేశారనే చెప్పాలి. 



రాజకీయ పాత్రలో చంద్రబాబు ప్రవేశం  ఆ సన్నివేశాలు పూర్తిగా కల్పితాలే. పూవు పుట్టగానే తన పరిమళం వెదజల్లు తుందన్నట్లు -  ఈ తొలి బాగం చూసి - బయోపిక్ రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఎలా ఉండబోతోందో? ఊహించ వచ్చు.  అభూత కల్పనల సమాహారం కానుందని చెప్పటానికి సంకోచం అక్కర్లేదు. ఈ సినిమాకు కచ్చితంగా రిపీట్ ఆడియన్స్ ఉండే అవకాశం ఏమాత్రం లేదు. చివరగా ఒకమాట  నాదేళ్ళ భాస్కరరావు పాత్రకు సచిన్ సచిన్ ఖేదేకర్ బాగ సూటయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్ లో శ్రీదేవి ఏమాత్రం కనిపించలేదు.
 
       

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: