టివి నటి నాగఝాన్సీ ఆత్మహత్య కేసు..ఆ ఫోన్ లో కీలక సమాచారం?!
బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య దర్యాప్తు ను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఝాన్సీ రెండు ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక ఫోన్ లాక్ ఓపెన్ కాగా అందులో ఉన్న మెసేజ్ల్లో కొన్ని ఆమె ప్రియుడు సూర్య తేజకు పంపి తిరిగి డిలీట్ చేసినట్లు గుర్తించారు. కాగా, టీవీ నటి నాగఝాన్సీ అంతకుముందు ప్రియుడు సూర్య తేజతో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ఉదయం ఆరు గంటలకు, పది గంటలకు, మధ్యాహ్నం మూడు గంటలకు అతడితో మాట్లాడిందని, మొత్తంగా పది నిమిషాలు అతడితో ఫోన్లో సంభాషించినట్టు పోలీసులు గుర్తించారు.
ఈ సంభాషణ ఆధారంగా వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగినట్టు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. డిలీట్ చేసిన మెసేజ్లను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తిరిగి అందుబాటు లోకి తెచ్చేందుకు పంజగుట్ట పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె వాడిన ఫోన్లలో శాంసంగ్ ఫోన్ లాక్ తెరిచిన పోలీసులు, ఐఫోన్ను అన్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో ఐ ఫోన్ లాక్ ఎంత ప్రయత్నించినా తెరుచుకోవడంలేదని పోలీసులు గురువారం తెలిపారు. కాగా లాక్ ఓపెన్ అయిన ఫోన్లో పెద్దగా సమాచారం లేదు.
ఝాన్సీ అన్న దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదులో సూర్య వేధింపుల వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని ఉండగా పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. మరోవైపు, అంత్యక్రియల కోసం స్వగ్రామానికి వెళ్లిన ఝాన్సీ కుటుంబ సభ్యులను విచారణ కోసం నగరానికి రావాలని పోలీసులు కోరినట్టు తెలుస్తోంది. ఆమె రెండో ఫోన్ ఐఫోన్ లాక్ చేస్తే తప్ప.. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. గత నెలలో కూడా ఒకసారి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.