బాలయ్య వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' బాలయ్య సినీ కెరీర్లో ఒక మైలు రాయి లాంటి సినిమా. ఈ సినిమా బాలయ్యతో పాటు దర్శకుడు క్రిష్కి మంచి పేరు తీసుకు వచ్చింది. ఆ వయసులో కూడా బాలయ్య వీరోచిత నటన, అంతటి పీరియాడికల్ మూవీని తక్కువ బడ్జెట్తో.. కేవలం 72 రోజులకే షూటింగ్ పూర్తి చేసిన క్రిష్ని సినిమా ఇండస్ట్రీలో అందరూ ఆకాశానికి ఎత్తారు. ఇక శాతకర్ణి తర్వాత బాలయ్య పూరీ జగన్నాథ్తో 'పైసావసూల్', కె.యస్. రవికుమార్తో 'జైసింహా', క్రిష్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ 'కథానాయకుడు, ఎన్.టి.ఆర్ మహానాయకుడు' సినిమాలు చేశాడు. బాలయ్య 100వ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా చేసినా ఇప్పటికీ 151 పూర్తి కాకపోవడం చూస్తే బాలయ్య జోరు ఏంటో తెలుస్తుంది.
ఇక బాలకృష్ణ తన 105వ సినిమాగా మళ్ళీ 'జైసింహా' దర్శకుడు, తమిళ సీనియర్ డైరెక్టర్ కె.యస్.రవికుమార్కే అప్పగించాడు. ఆ సినిమా నిర్మాత కూడా సి.కళ్యాణ్. ముందు అనుకున్న ప్రకారం ఈ సినిమా ఎన్నికలకు ముందే ప్రారంభం అవుతుందని భావించారు. కానీ వీలుకాలేదు. ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయింది. ఈ సినిమా కథ ప్రకారం పొలిటికల్ నేపథ్యం ఉండే స్టోరీ అని సమాచారం. టిడిపికి వ్యతిరేక పార్టీలకి చెందిన వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ జగన్లను సినిమాలో విలన్లుగా చూపించనున్నారని, కానీ వైసీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాని మిడిల్ డ్రాప్ చేశారని వార్తలు వచ్చాయి.
అయితే ప్రస్తుతం సినిమాలో వచ్చే డైలాగ్స్, కొన్ని సీన్స్ని తిరిగి రీరైట్ చేయించారట. అంతేకాదు ఆగిపోయిందని ప్రచారం జరిగిన ఈ సినిమాని ఈనెల 12న ప్రారంభించి, వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం చూస్తున్నారు. మొత్తానికి ఎన్బీకే105 ప్రారంభం కానుండటం నందమూరి అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయమేనని చెప్పాలి....