అందరిలానే ఆఫర్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాను..!
‘దొరసాని’ చిత్రంతో నటిగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు నటుడు రాజశేఖర్ కుమార్తె శివాత్మిక. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండకు కూడా ఇదే తొలి చిత్రం. కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 12న సినిమా విడుదల కాబోతోంది. శివాత్మిక మీడియాతో ముచ్చటించారు. నటిగా తన అనుభూతుల్ని పంచుకున్నారు...
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి షూటింగ్ నా జీవితంలో భాగం అయిపోయింది. పాఠశాలలో కన్నా సెట్లోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని. అందుకేనేమో.. నేను హీరోయిన్ అవుతానని ఇంట్లో చెప్పినప్పుడు ఎవరూ పెద్దగా సర్ప్రైజ్ అవలేదు. కానీ ‘దొరసాని’ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంట్లో సందడి ఎక్కువైంది.
ఈ చిత్రంలో పాత్రల కోసం రాసుకున్న సన్నివేశాలు ఏమీ లేవు. మహేంద్ర కథతోనే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళారు. నేను ఒక డైలాగ్ చెప్పకుండానే ఎందుకు ఎంచుకున్నారనే విషయాన్ని షూటింగ్ అయ్యాక చెప్పారు. ఆయన సన్నివేశాలను బాగా వివరిస్తారు. ఆయన చెప్పింది చేసుకుంటూ వెళితే చాలు. మొదటి సన్నివేశానికి చాలా కంగారు పడ్డాను, కానీ దర్శకుడు ఇచ్చిన నమ్మకం నన్ను నడిపించింది.
ఈ కథ విన్నప్పుడు నా పాత్ర బాగా నచ్చింది. దర్శకుడు మహేంద్ర ఆ పాత్రను వివరించిన విధానం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. నాలుగు గంటల పాటు కథ చెప్పారు. ఆ తర్వాత నన్ను, ఆనంద్ని కలిపి ఆడిషన్స్ చేశారు. తర్వాత రెండు నెలలు నాకు ఎలాంటి కబురు అందలేదు. ఆ సమయంలో చాలా ఎదురుచూశా. కథానాయిక నేనే అని తెలిసిన తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యా..!