ఒకప్పుడు బాలీవుడ్ తర్వాత దేశవ్యాప్తంగా తమ సినిమా ఇండస్ట్రీయే గొప్ప అన్న పొగరు తమిళనాడులో ఎక్కువుగా ఉండేది. రజనీకాంత్, కమల్హాసన్ నుంచి ఆ తర్వాత అజిత్, విజయ్ లాంటి హీరోల ఎంట్రీతో పాటు కోలీవుడ్ హీరోలు, దర్శకులు ఎంచుకునే కథలతో వాళ్ల సినిమాలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభించింది అంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు అక్కడ ప్రతి హీరో సినిమా మన తెలుగులో రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో అక్కడ మీడియం రేంజ్ హీరోలకు కూడా మన తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది.
కాలం మారడంతో తెలుగు హీరోలు, దర్శకులు ఎంచుకునే కథల తీరు మారడం బాహుబలి, శ్రీమంతుడు, రంగస్థలం, ఇప్పుడు సాహో లాంటి సినిమాలతో తెలుగు సినిమా బాలీవుడ్ సినిమానే తలదన్నేలా దూసుకుపోతోంది. బాలీవుడ్ సినిమాలు సైతం ఇప్పుడు తెలుగు సినిమాల వైపు చూస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా మన హీరోలు దడ పుట్టిస్తున్నారు. మరోవైపు కోలీవుడ్ హీరోల తీరు మారింది. అక్కడ తాజాగా అజిత్, విజయ్ అభిమానుల మధ్య వార్ నడుస్తోంది.
కొద్దిరోజుల క్రితం విజయ్ చనిపోయాడంటూ యాష్ ట్యాగ్ తో అజయ్ ఫ్యాన్స్ ఓ వార్తను వైరల్ చేయగా, తాజాగా విజయ్ ఫ్యాన్ ఒకరు అజిత్ ఫ్యాన్ పై కత్తితో దాడి చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నా ఆ ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం ఈ గొడవను సద్దుమణిగేలా చేయడం లేదు. ఈ విషయంలో మన తెలుగు హీరోలు చాలా స్పోర్టివ్గా ఉంటారు. కొద్ది రోజుల నుంచి మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, బన్నీ వంటి హీరోలు కలిసి ఒకే వేడుకలపై సందడి చేస్తున్నారు.
ఆ మధ్య మహేష్ ఎన్టీఆర్ ఓ చిత్ర వేడుక కార్యక్రమంలోపాల్గొని ఒకరిపై ఒకరు పొగడ్తలు కురిపించుకున్నారు.
ఆ సందర్బంలో మహేష్ ఓపెన్ మేము బాగానే ఉంటాం, ఫ్యాన్స్ మీరెందుకు కొట్టుకుంటారు అని ప్రశ్నించడం జరిగింది. ఎన్టీఆర్ -చరణ్ - మహేష్ కుటుంబ సమేతంగా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక నాని ప్రభాస్ మూవీని ఉద్దేశిస్తూ ఈ మూవీ మాది, ప్రభాస్ అన్న సాహో భారీ విజయం సాధించాలని ట్వీట్ చేయడం గమనార్హం. మరి కోలీవుడ్ స్టార్ హీరోలైన రజని, అజిత్, విజయ్, కమల్, విక్రమ్ లాంటి వారు ఈ దశగా ఎందుకు ఆలోచించడం లేదు అన్నది వాళ్లకే తెలియాలి. నిజంగా వాళ్లు ఈ విషయంలో ఫ్యాన్స్ను కంట్రోల్ చేస్తే కోలీవుడ్లో అభిమానుల మధ్య ఇన్ని గొడవలు జరగవు. మరి ఇప్పటకి అయినా వాళ్లు తెలుగు హీరోలను స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారనే ఆశిద్దాం.