సౌత్ ఇండస్ట్రీ లో ఓవర్సీస్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రం గా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. ఫార్ ఫిలిమ్స్ ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులను 42కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న దర్బార్ కూడా అదే బాటలో పయనిస్తుంది. ఈ సినిమా అన్ని భాషల ఓవర్సీస్ హక్కులను కూడా ఫార్ ఫిలిమ్స్సే సొంతం చేసుకుంది. ఈ హక్కుల విలువ 38కోట్లని సమాచారం. దాంతో ఓవర్సీస్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన కోలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టించింది దర్బార్. మరి ఈ రెండు సినిమాలు యుఎస్ ప్రేక్షకులను మెప్పించి ఆ మొత్తాన్ని వెనక్కు తెస్తే ఓకే కానీ అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే మాత్రం బయ్యర్లు భారీ గా నష్టపోనున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
ఇక సాహో ఈ నెల 30 న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవ్వగా దర్బార్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరోయిన్ నివేతా థామస్ ముఖ్య పాత్రలో కనిపించనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. రజినీ -మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడం తో దర్బార్ ఫై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.