తన పిచ్చి పై సెటైర్లు వేసుకున్న జెడి !

Seetha Sailaja


ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు జెడి చక్రవర్తి తనకు పిచ్చి అంటూ తన పై తాను వేసుకున్న సెటైర్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. రామ్ గోపాల వర్మ శిష్యుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జెడి ముందుగా హీరోగా మారి ఆ తరువాత దర్శకుడిగా మారి తిరిగి యూటర్న్ తీసుకుని విలన్ గా మారిపోయాడు. ఈరోజు విడుదలైన ‘డైనమైట్’ సినిమాలో విలన్ గా నటిస్తున్న జెడి ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విలక్షణ వ్యాఖ్యలు చేసాడు. 

తనకు టాలీవుడ్ లో అవకాశాలు రాక సినిమాలు చేయడం లేదని చాలామంది భావిస్తూ ఉంటారని అయితే తనకు చేసిన పాత్రనే మళ్ళీమళ్ళీ చేయాలి అంటే విసుకు పుడుతున్న నేపధ్యంలో తనకు ఆ పాత్ర బాగా నచ్చితేనే తాను ఆ సినిమాలో నటిస్తున్నానని అందువల్ల కొందరు తనను పిచ్చివాడు అనుకున్నా తాను లెక్క చేయను అని సంచలనాత్మక వ్యాఖ్యలు చేసాడు జెడి చక్రవర్తి.

ప్రస్తుతం తాను విలన్ గా నటించిన ‘డైనమైట్’ సినిమా గురించి మాట్లాడుతూ బాగా చదువుకున్న వాళ్ళు దర్శకులుగా మారితే సినిమాలు ఎంత బాగా తీయవచ్చో దేవ కట్టా తీసిన ‘డైనమైట్’ సినిమా బట్టి అర్ధం అవుతుంది అని అంటూ ఈసినిమాలో హీరో మంచు విష్ణును తాను కింద పడవేసి తన్నే సన్నివేశంలో తాను మొహమాటపడి నెమ్మదిగా తన్నుతూ ఉంటే ‘ఇంకా గట్టిగా కొట్టు భయ్యా లేకపోతే సీన్ పండదు’ అంటూ విష్ణు ప్రోత్సహించిన సందర్బాన్ని గుర్తుకు చేసుకుంటూ ఇగోలేని అటువంటి హీరోలు ఎక్కడ ఉన్నారు అంటూ హీరోల పై సెటైర్లు వేసాడు జెడి.

ఒకనాటి హీరో జగపతి బాబు ప్రస్తుతం టాప్ విలన్స్ లిస్టులో చేరిపోయిన నేపధ్యంలో మంచి నటుడిగా పేరు గాంచిన జెడి చక్రవర్తికి కూడ విలన్ గా ఈ ‘డైనమైట్’ కలిసి వస్తే మళ్ళీ జెడి హవా మొదలయ్యే అవకాశం ఉంది. మరి ప్రేక్షకులు ఏమి తీర్పు ఇస్తారో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: