60 ఎళ్ల కల సాకారమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తుంది. జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 60 సంవత్సరాలుగా తెలంగాణ గురించి ఎంతో మంది జీవితాలు బలి చేసుకొని..ఆస్తులు పోగొట్టుకొని చివరికి ప్రాణ త్యాగాలు కూడా చేసుకున్నారు. ఇక కేసీఆర్ తెలంగాణ రాష్ట్రసమితి ఏర్పాటు చేసిన ఈ ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత ఈ ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. తెలంగాణలో చిన్న పిల్లల నుంచి చనిపోతున్న వృద్దుల వరకు జై తెలంగాణ అనే నినాదాని ఎలుగెత్తి పలికారు.
ఇక ఉద్యోగులు సకలజనుల సమ్మెతో ప్రభుత్వ కార్యాకలాపాలు స్థంబింప చేశారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి..ఇలా రక రకాలు ఉద్యమాలు కొందరు యువకులు ఆత్మబలిదానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం తలదించింది. మొత్తానికి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఇటీవల డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ నగరంలో ఘనంగా నిర్వహించారు.
ఈ ఉత్సవాలలో డెన్కార్క్లో నివసిస్తున్న తెలుగు వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డెన్మార్క్ ప్రముఖ న్యాయవాది ఆగెక్రాంప్, మానవహక్కుల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉత్సవాలకు టాడ్ ప్రెసిడెంట్ రాజరెడ్డి, కార్యవర్గ సభ్యులు కిరణ్మయి, శ్యాం ఆకుల, ఉపేందర్, శ్యాం చెలిక, కరుణాకర్, ఉమ, సంతోష్, రాజ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు నృత్యాలు, ఆటలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.అనంతరం పలువురుకి బహుమతులను అందచేశారు.