కాళిదాసు, పోతన వంటి గొప్ప కవులు జన్మించిన దేశంలో పుట్టడం గర్వకారణమని నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. డల్లాస్లోని మలంకార చర్చిలో తానా, టాంటెక్స్ ఆధ్వర్యంలో తనికెళ్లభరణితో ‘సరదాగా ఓ సాయంత్రం’ అనే సాహిత్య, సినిమా కార్యక్రమం నిర్వహించారు. శ్రోతలు అడిగిన ప్రశ్నలకు కవితలను ఆలపిస్తూ భరణి సమాధానాలిచ్చారు. పిల్లలు కేవలం చదువు మీదే కాకుండా మానసిక వికాసం పొందడానికి సాహిత్యం, సంగీతం, లలితకళల విషయాల పట్ల అభిరుచి పెంచుకోవాలని సూచించారు.
సాహిత్య లోకానికి ఎంతో కృషి చేసిన శ్రీశ్రీ, గురజాడ, తిలక్, పానుగంటి వారికి ఇప్పటికీ గుర్తింపు లభిస్తుందన్నారు. తనికెళ్ల భరణి తీసిన మిథునం సినిమా అద్భుతంగా ఉందని తానా మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ.. తాను నటించిన ‘జ్యో అచుత్యానంద’ సినిమాను అభిమానులతో కలిసి వీక్షించడానికి డల్లాస్ వచ్చినట్లు తెలిపారు. ప్రవాస తెలుగువారికి డల్లాస్ ప్రధాన కేంద్రంగా మారిందని సతీష్ వేమన అన్నారు.
కథానాయకుడు నారా రోహిత్, తానా అధ్యక్షుడు సతీష్ వేమనలను తానా కోశాధికారి మురళి వెన్నం, సంయుక్త కోశాధికారిడాక్టర్ రాజేష్ అడుసుమిల్లి, డైరెక్టర్ చలపతి కొండ్రకుంట, ప్రాంతీయ ప్రతినిధి శ్రీకాంత్ పోలవరపు ఘనంగా సత్కరించారు. మైమ్ మధు డ్రీం, వెయిట్ లిఫ్టర్, బర్డ్ అండ్ హంటర్ వంటి థీమ్ను ప్రదర్శించి శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణిని తానా కోశాధికారి మురళి వెన్నం, సంయుక్త కోశాధికారి డాక్టర్ రాజేష్ అడుసుమిల్లి, డైరెక్టర్ చలపతి కొండ్రకుంట, ప్రాంతీయ ప్రతినిధి శ్రీకాంత్ పోలవరపు, తానా టాంటెక్స్ కార్యవర్గ బృందం అధ్యక్షులు సుబ్బు జొన్నలగడ్డ, కార్యదర్శి చినసత్యం ఘనంగా సత్కరించారు.