మహాత్ముడి ‘టాల్స్టాయ్’కు పూర్వవైభవం!
దక్షిణాఫ్రికాలో మహాత్ముడి సత్యాగ్రహ ఉద్యమానికి కేంద్రమైన టాల్స్టాయ్ తోటకు పునర్వైభవం కల్పించేందుకు అక్కడి భారతీయ వ్యాపార దిగ్గజాలు ప్రతినబూనారు. జోహెన్నెస్బర్గ్ నుంచి 30కిలోమీటర్ల దూరంలోని ఈ టాల్స్టాయ్ తోట కేంద్రంగానే ఇక్కడి వెనుకబడిన జాతులకోసం గాంధీ ఉద్యమించారు. అలాంటి ఈ చరిత్రాత్మక స్థలం ఆ తర్వాత నిరాదరణకు గురైంది. ప్రస్తుతం ఇక్కడ గాంధీ నివాసం తప్ప మరేమీ కనిపించటం లేదు.ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలోని భారత కాన్సుల్ జనరల్ కేజే శ్రీనివాస్.. ఈ టాల్స్టాయ్ తోటకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సంకల్పించారు. ఇందుకోసం దక్షిణాఫ్రికాలోని భారతీయ వ్యాపారవేత్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కేంద్రం వైభవాన్ని వారందరికీ గుర్తుచేశారు. దీన్ని పరిరక్షించుకునేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. దీనికి అద్భుతమైన స్పందన లభించింది. ప్రతి ఒక్కరూ పెద్దమొత్తంలో నిధులు, వస్తువులు చేకూర్చేందుకు నడుంబిగించారు.