60 దేశాలు.. 400 విమానాలు.. 37 వేల మంది ...
మహమ్మారి కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు కకావికలం అవుతున్నాయి. వైరస్ వ్యాప్తి ని కట్టడి చేయలేక పలు దేశాలు చేతులెత్తేస్తున్నాయి. అనేక రంగాలు కుప్పకూలు తున్నాయి. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆయా దేశాలు లాక్డౌన్ ప్రకటించగా, విదేశాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా స్వదేశాలకు రప్పించేందుకు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా తమ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చే పనులను ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు 37 వేలకు పైగా అమెరికన్లను 60 దేశాల నుంచి తరలించింది. వీరి కోసం 400లకుపైగా విమానాలను ఏర్పాటు చేసింది. అయినా మరో 20 వేల అమెరికన్లు వివిధ దేశాల్లో ఉన్నారని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఎక్కువ మంది భారత్, దక్షిణాసియా దేశాల్లో ఉన్నారని తెలిపింది. వీరందరి కోసం సుమారు 70 విమానాలను నడపనున్నామని వెల్లడించింది. కరోనా వైరస్తో అమెరికాలో ఏడువేల మంది మరణించగా, 2.7 లక్షల మంది పాజిటివ్ కేసులు న మోదయ్యాయి.