మహాత్మునికి నివాళులర్పించిన తెలుగు ప్రముఖులు
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో తెలుగు ప్రముఖులు మహాత్మాగాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఇర్వింగ్లోని గాంధీజీ స్మారక ప్రదేశాన్ని సందర్శించిన ప్రముఖ గాయకుడు డా. వందేమాతరం శ్రీనివాస్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ దుర్గాభవాని, ప్రముఖ కూచిపూడి గురువు కేవీ సత్యనారాయణ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ డల్లాస్లో మహాత్ముని విగ్రహం చూసి తాను ఎంతో సంతోషపడ్డానని అన్నారు.
విగ్రహ స్థాపనకు కృషి చేసిన మహాత్మాగాంధీ మెమోరియల్నార్త్ టెక్సాస్(ఎంజీఎంఎన్టీ)సంస్థ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, సంస్థ సభ్యుల కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా వందేమాతరం శ్రీనివాస్ ఓ పాటను ఆలపించారు. వైస్ ఛాన్సలర్ దుర్గా భవాని మాట్లాడుతూ.. డల్లాస్లో మహాత్ముని విగ్రహం నెలకొల్పడం అమెరికా సందర్శనకు వచ్చిన ఎంతో మంది భారతీయులకు స్ఫూర్తినిస్తుందన్నారు. పద్మావతి విశ్వవిద్యాలయం ఆవరణలో గాంధీ విగ్రహస్థాపనకు వ్యక్తిగతంగా రూ.8 లక్షలు విరాళంగా ఇచ్చిన ప్రసాద్ తోటకూరను ప్రత్యేకంగా అభినందించారు. ఎంజీఎంఎన్టీ అధ్యక్షులు ప్రసాద్తోటకూర, కార్యదర్శి రావు కాల్వల, ఎంవీఎల్ ప్రసాద్ తదితరులను అభినందించారు.