రాజకీయాల్లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి కుటుంబానికి ప్రత్యేకస్థానం ఉంది. తాము నమ్మిన నాయకుడిని, తాము నమ్మిన వ్యక్తులను ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఎన్ని ప్రలోభాలు పనిచేసినా.. వదిలి పెట్టని తత్వాన్ని ఈ కుటుంబం నరనరానా జీర్ణించుకుంది. అంతేకాదు.. కులాలకు అతీతంగా ప్రజలతో ఏర్పాటు చేసుకున్న బంధం కూడా అలాంటిదే! అందుకే ఈ కుటుంబంపై తరచుగా విమర్శలు వస్తున్నా.. పార్టీ నాయకుడి కుటుంబానికి.. జక్కంపూడి కుటుంబానికి మద్య ఉన్న అవినాభావ సంబంధం చెరిగేది.. తరిగేది.. కాదనే చెప్పాలి. విషయంలోకి వెళ్తే.. రాజానగరం నుంచి విజయం సాధించిన జక్కంపూడి రాజాకు తక్కువ టైంలోనే తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఇందుకు కారణం.. నిబద్ధత, విలువలకు ప్రాణాలు ఇచ్చే కుటుంబం కావడమే..!
ఉమ్మడి రాష్ట్రంలో కడియం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న జక్కంపూడి రామ్మోహన్రావు.. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎంతో ఆత్మీయంగా మెలిగారు. 1999లో కడియం నుంచి గెలుపు గుర్రం ఎక్కిన రామ్మోహన్రావు.. వైఎస్ అనుచరుడిగా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. రాజశేఖరరెడ్డి ఏం చెబితే.. అంతే! అన్నట్టుగా ఆయన వ్యవహరించారు. అంతేకాదు.. వైఎస్కు అత్యంత విధేయుడిగా ఆయన ముందుకు నడిచారు. ఈ బంధం ఆ ఫ్యామిలీతో వైఎస్ తర్వాత ఆయన కుమారుడితోనూ ఇప్పటికీ కొనసాగుతుండడం గమనార్హం.
ఇక, 2004లోనూ రామ్మోహన్ విజయం సాధించారు. ఈ క్రమంలో అప్పటి వైఎస్ ప్రభుత్వం ఆయనకు రోడ్లు, భవనాల మంత్రిగా అవకాశం ఇచ్చింది. అయితే.. మధ్యలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయినప్పటికీ.. వైఎస్.. రామ్మోహన్తో ఉన్న అనుబంధం కారణంగా.. ఆయనను పూర్తి కాలం పదవిలో కొనసాగించారు. అంతేకాదు.. 2009లో కడియం సీటు రద్దయిన నేపథ్యంలో విజయలక్ష్మికి రాజమండ్రి రూరల్ నుంచి టికెట్ ఇచ్చారు. అయితే.. ఆమె ఓడిపోయారు. అనంతరం.. ఈ కుటుంబం వైఎస్ జగన్ పక్షాన నిలిచింది. అప్పట్లో రాజశేఖరరెడ్డి విషయంలో ఎంత ఆత్మీయతను కనబరిచిందో.. తర్వాత కాలంలో అంతే ఆత్మీయతను జగన్ విషయంలోనూ ఈ కుటుంబం చూపించింది.
ఈ క్రమంలోనే 2014లో మరోసారి వైసీపీ తరపున విజయలక్ష్మి రాజమండ్రి రూరల్ సీటు వదులుకుని రాజానగరం నుంచి పోటీ చేశారు. అయితే.. అప్పటి ఎన్నికల్లోనూ ఆమె ఓడిపోయారు. 2009, 2014 రెండు ఎన్నికల్లోనూ ఆమె స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ క్రమంలో రామ్మోహన్ వారసుడు జక్కం పూడి రాజాకు జగన్ అవకాశం కల్పించారు. యువ నాయకుడిగా..అందరినీ కలుపుకొని పోవడంతోపాటు.. పార్టీకి, పార్టీ అధినేతజగన్కు ఎంతో విధేయుడిగా ఆయన పేరుతెచ్చుకున్నారు.
ఈ క్రమంలోనే 2019లో జగన్ రాజాకు రాజానగరం టికెట్ కేటాయించారు. ఆయన విజయం అనంతరం.. ఈ కుటుంబానికి మరింత ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్.. రాజాకు కాపు కార్పొరేషన్ పదవిని ఇచ్చారు. అంతేకాదు.. పార్టీలోనూ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్ నాటి నుంచి ఇప్పటి వరకు రాజా కుటుంబం పార్టీకి.. వైఎస్ కుటుంబానికి ఎంతో వినయ విధేయలతో ఉండడమే కారణంగా కనిపిస్తోంది. అంతేకాదు.. త్వరలోనే జరగనున్న మంత్రి వర్గ విస్తరణలోనూ.. రాజాకు కాపుల కోటాలో ప్రాధాన్యం దక్కుతుందన్న చర్చలు ఎలా ? ఉన్నా ఈ రెండు కుటుంబాల మధ్య తరతరాల అనుబంధంమే ఇక్కడ హైలెట్.