టీపీసీసీ చీఫ్గా బాధ్యలు చేపట్టిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. అలాగే అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. కేసీఆర్ - టీఆర్ఎస్ టార్గెట్గా విమర్శనాస్త్రాలను సిందిస్తున్నారు. ఇన్నాళ్లు రేవంత్ రెడ్డిని పట్టించుకోని కేటీఆర్ కూడా రేవంత్ రెచ్చిపోవడంతో రంగంలోకి దిగారు. తాజాగా రేవంత్ రెడ్డి చేపట్టిన నిరుద్యోగ జంఘ్ సైరన్ను తీసి పారేశారు రాష్ట్ర మంత్రి కేటీఆర్.. జంఘ్ లేదు ఏం లేదు అది జంగు పట్టిన పార్టీ అంటూ ఎద్దేవా చేశారు.
ఈ నిరసనపై కేటీఆర్ మాట్లాడడం చూస్తే ఆయన మీద ఎంత ప్రభావం చూపిస్తే ఇలాంటి మాటలు వస్తాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఇంతకు ముందు లేని ఆరోపణలను తెరమీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర పోరాట సమయంలో బాబు పంచన ఉండి.. తెలంగాణ ఉద్యమకారుల పైకి తుపాకి తీసుకువెళ్లారని కొత్త ఆరోపణలను తెరమీదకు తీసుకువచ్చారు. చంపిన వారే సంతాపం తెలిపారని.. శ్రీకాంతా చారికి పూల దండ వేశారని మండిపడ్డారు.
అయితే, కేటీఆర్ మాటలు చూస్తుంటే చంద్రబాబుపై విసిరిన అస్త్రమే రేవంత్ రెడ్డిపై ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతంతో టీడీపీ తీవ్ర నష్టం చేకూర్చింది. నాకు రెండు ప్రాంతాలు రెండు కండ్లు అంటూ బాబు మాట్లాడడమే మైనస్ అయింది. అదే క్రమంలో తెలంగాణ ఉద్యమం తీవ్ర తరం కావడంతో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారు.
అయినా తెలంగాణలో చంద్రబాబుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడి నుంచే పార్టీ కనుమరుగు అవడం ప్రారంభం అయింది. పైగా 2014 లో చంద్రబాబు అధికారంలో ఉండడం.. ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ఇద్దరి మధ్య పెద్ద వార్ జరిగింది. ఈ క్రమంలో బాబు తెలంగాణ ద్రోహి అని ముద్ర పడడంతో తెలంగాణలో టీడీపీ పూర్తిగా నష్టపోయింది. ఇక 2018 ఎన్నికల్లో కూడా బాబును బూచీగా చూపడం టీఆర్ఎస్ గెలవడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఇప్పుడు అదే తరహాలో టీఆర్ఎస్ రేవంత్రెడ్డిని టార్గెట్ చేసింది.