తెలంగాణలో దసరా కిక్కు.. అక్షరాలా 2వందల కోట్లు..
అవును.. తెలంగాణాలో మందుబాబులు ఒక్కరోజులోనే 200 కోట్ల రూపాయల మందు తాగేశారు. దసరా పండుగ సందర్భంగా ఈ అరుదైన రికార్డు సాధించారు. అసలే గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో.. సరదాలు లేకపోవడంతో ఈ దసరా పండుగను మందుబాబులు అస్సలు విడిచిపెట్టదలచుకోలేదు. అప్పుచేశారో.. పెళ్ళాం మెడలో నగలు తాకట్టు పెట్టారో.. లేక ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేశారో తెలియదుగానీ.. మొత్తానికి బంపర్ అమౌంట్ ను తెలంగాణా ప్రభుత్వానికి గిఫ్ట్ గా ఇచ్చారు. తెలంగాణాలో గడిచిన ఐదు రోజుల్లో మద్యం అమ్మకాలను పరిశీలిస్తే.. కళ్ళుతిరగక మానవు.
తెలంగాణాలో గడిచిన ఐదు రోజుల్లో 685 కోట్ల రూపాయల మద్యం అమ్ముడైంది. గత 12 రోజుల లెక్కలు తీస్తే.. 1430 కోట్ల రూపాయల మందును ఖాళీ చేశారు మన మందుబాబులు. పండుగ రోజుల్లో తెలంగాణాలో స్టాక్ లేక, పక్క రాష్ట్రాల నుంచి కూడా సరుకు తెప్పించారంటే పరిస్థితి మీరే అర్ధం చేసుకోవచ్చు. కేవలం దసరా పండుగ ఒక్కరోజే 200 కోట్ల మందు తాగేసి.. స్టడీగా నిల్చున్నారంటే.. మన మందుబాబుల కెపాసిటీ ఏమిటో అర్ధం అయిపోతుంది. ఈ నెలాఖరునాటికి మరొక 1600 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతాయని అంచనా.. దీంతో రాష్ట్ర ఎక్సయిజ్ శాఖకు భారీ ఆదాయం వచ్చిపడనుంది. ఏది ఏమైనా ఇంతలా ప్రభుత్వానికి టాక్స్ కడుతున్న టాక్స్ పేయర్స్ ను గౌరవంగా చూడాల్సిన భాద్యత మనందరిపైనా ఉంది.