విశాఖ కేంద్రంగా ప్రశాంత్ కిశోర్ బృందం ఓ సర్వే నిర్వహించి వెళ్లింది. ఈ సారి సిట్టింగులకే టిక్కెట్లు అనుకునేందుకు వీల్లేదని తేలిపోయింది. అదేవిధంగా పార్టీపై దృష్టి సారించి పనిచేయాలని జగన్ చెబుతున్నప్పటికీ అవేవీ పట్టించుకోని విధంగా కొందరు ఉండడంతో ఇప్పటికే వారిని అప్రమత్తం చేయాలని భావిస్తున్నారు. ఇందుకు ప్రశాంత్ కిశోర్ బృందం కూడా కొన్ని సూచనలు చేసిందనే తెలుస్తోంది. డబ్బులు వెచ్చించడం కన్నా ప్రజల నమ్మకం అన్నది పెంచుకోవడమే కీలకంగా రాజకీయం నడవాలని జగన్ చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకుని పోవాలని పదే పదే చెబుతున్నారు. కానీ అవేవీ చాలా చోట్ల అమలుకు నోచుకోవడం లేదని గ్రౌండ్ రిపోర్టు ఆధారంగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అదేవిధం గా ఉంది. పనిచేయని ఎమ్మెల్యేలను పక్కనుంచనున్నారని తేలిపోయింది. త్వరలో జిల్లాల్లో పర్యటించే సమయంలో తన దృష్టికి వచ్చే సమస్యలపై పూర్తి దృష్టి నిలిపి, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని, అందుకు ఎమ్మెల్యేలు సిద్ధం కావాలని అంటున్నారు.
ఇదే సందర్భంలో శ్రీకాకుళంలో సిట్టింగులకు మళ్లీ అవకాశం ఇవ్వకూడదనే అనుకుంటున్నారు. కొందరు తప్పుకోవాలని కూడా అనకుంటున్నారు. విజయనగరంలో కూడా కొత్త ముఖాలే కనిపించేందుకు అవకాశాలున్నాయి. విశాఖలో గంటా శ్రీను పార్టీ మారితే, పూర్తిగా సమీకరణలు మారిపోతాయి కనుక ఇక్కడ కూడా కొన్ని కొత్త ముఖాలకు రాజయోగం దక్కిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఒకటి చేస్తున్నారు. తూగో, పగోలలో క్యాస్ట్ సమీకరణాలపై ఇప్పటికే వివరాలు పొంది ఉన్నారు జగన్. ఈ సారి కన్నబాబు లాంటి సీనియర్లను పక్కనబెట్టాలనకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. సీమలో మాత్రం టీడీపీ - జనసేన పొత్తు ఉంటే ఇంకొన్ని మార్పులు సాధ్యం అయ్యే అవకాశం ఉంది.
జగన్ - ప్రశాంత్ కిశోర్ కలిసి గత ఎన్నికల్లో పనిచేశారు. ప్రశాంత్ కిశోర్ అనే ఓ స్ట్రాటజిస్ట్ ఏం చెప్పారో అదే చేశారు. తాజాగా జగన్ మళ్లీ ప్రశాంత్ కిశోర్ నే నమ్ముకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన వ్యూహాలతోనే పనిచేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. ఎన్నికలకు సంబంధించి ఆశావహులు ఎవరన్నది ఆరా తీస్తున్నారు. రాయలసీమతో సహా ఇతర ప్రాంతాలకు సంబంధించిన నేతలంతా కొంత సీఎం దగ్గర పలుకుబడి ఉపయోగించి టిక్కెట్లు తెచ్చుకోవాలని భావించినా, వారికి కూడా అడ్డంగా ప్రశాంత్ కిశోరే నిలవనున్నారు. ఇప్పటికే కొన్ని సర్వేలు చేయించిన జగన్ వాటికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్ రాక కొందరికి కంటగింపుగానే మారనుంది. కొందరికి మాత్రం కొత్త ఉత్సాహం ఇస్తోంది.