జిమ్లకు మార్గదర్శకాలు జారీ చేసిన కర్ణాటక..!
పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ మృతితో జిమ్లు, ఫిట్నెస్ సెంటర్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ వైద్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. కార్డియాలజిస్టుల నుంచి వివరాలు సేకరించింది. జిమ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఓ గైడ్ లైన్స్ జాబితాను రూపొందించినట్లు మంత్రి సుధాకర్ తెలిపారు. ఇప్పటికే ప్రముఖ గుండె వైద్యులు డాక్టర్ వివేక్, డాక్టర్ మంజునాథ, డాక్టర్ దేవి షెట్టి, డాక్టర్ రంగధామలతో కలిసి ఓ కమిటీ ఏర్పాటు చేసింది కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ప్రతి ఫిట్ నెస్ సెంటర్లో కూడా ఓ ఫిజిషియన్ తప్పని సరిగా ఉండాలని వైద్యుల బృందం సూచించింది. అలాగే అత్యవసర వైద్య సహాయం కోసం తప్పని సరిగా కొన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని కూడా వెల్లడించింది. అలాగే గుండె జబ్బులు ఉన్న వారు, గుండె సంబంధిత చికిత్సలు తీసుకున్న వారి పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇక హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారు ఎక్కువ మోతాదులో కసరత్తు చేయకుండా చూడాలని కూడా ప్రభుత్వానికి వైద్యుల బృందం నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫిట్నెస్ సెంటర్లు, జిమ్లకు కూడా కీలక ఉత్తర్వులు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం.