విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది ఓ నినాదం. కేంద్రం మాత్రం విశాఖ ఉక్కును తుక్కు తుక్కుగా మార్చి అమ్మేయాలని ఎప్పుడో నిర్ణయించాడు. కంపెనీకి నష్టాలు వస్తున్నాయని, దీనిని నడపడమే భారమని చెబుతున్నాడు. ఇదేవిధంగా గతంలోనూ నష్టాలున్న ప్రభుత్వ రంగ సంస్థలను తాము అమ్మేశామని, వదిలించుకున్నామని కూడా గుర్తు చేస్తున్నాడు. కనుక ప్రయివేటీకర ణ అన్నది తప్పదని కూడా చెబుతున్నాడు. ఇప్పటికీ రైల్వేలను దశలవారీగా ప్రయివేటీకరిస్తున్నామని, అదేవిధంగా బీఎస్ఎన్ఎ ల్ ను కూడా ప్రయివేటీకరించేందుకు సిద్ధం అయి ఉన్నామని చెబుతున్నాడు. ఈ దశలో విశాఖ ఉక్కుకు కూడా అందుకు మినహాయింపు ఏమీ లేదని పదే పదే బల్ల గుద్ది మరీ! దేశ ప్రజలకు తనదైన సందేశం ఒకటి ఇస్తున్నాడు. అయితే ఆర్థిక భారం ఒక్కటే సాకుగా చూపి సంస్థను అమ్మడం ఏమీ సబబు కాదని పదే పదే కమ్యూనిస్టులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు.
ఇదే దశలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థను టేకోవర్ చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా ఉంది. మరోవైపు ఎయిర్ లైన్స్ ను చేజిక్కుంచుకున్న విధంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా సొంతం చేసుకోవాలన్న వాదన ఒకటి టాటా కంపెనీలకు సంబంధించి వినిపిస్తోంది. అయితే ప్రపచం వ్యాప్తంగా స్టీలుకు వాటి ఉత్పత్తులకు ఉన్న గిరాకీ తగ్గిపోయినందున ఈ వ్యాపారం తమకు లాభసాటి కాబోదని టాటా భావిస్తే ఎవ్వరూ ఏం చేయలేరు. ఇదే సమయంలో ప్లాంటుకు సంబంధించి విలువయిన ఆస్తుల విషయమై కూడా చర్చ నడుస్తోంది.
ఇప్పటికే ప్లాంటుకు చెందిన విలువయిన భూములను వైసీపీ పెద్దలు కొందరు తమ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణ ఒకటి వినిపిస్తోంది. ఎలానూ ప్లాంటు ప్రయివేటీకరణ అన్నది ఆపడం సాధ్యం కాదు కనుక కంపెనీకి చెందిన విలువయిన భూములు చౌకగా కొట్టేయాలని ప్లాన్ వేస్తోంది వైసీపీ అని ఓ అభియోగం వినిపిస్తోంది. ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నా కోట్ల రూపాయలు విలువ చేసే భూములు మాత్రం కంపెనీకి ఉన్నా కేంద్రం వాటిపై దృష్టి సారించక, ఆస్తులపై దృష్టి సారించక కేవలం ప్లాంటు పై మాత్రమే దృష్టిసారించడం ఏంటో? ఆస్తులు అమ్మయినా సరే ప్లాంటు ను పరిరక్షించాలి కదా! కానీ ఆ పని మాత్రం కేంద్రం చేయడం లేదు. విలువయిన భూములు వైసీపీకి దక్కేందుకు ఉన్న సమీప అవకాశాలను సంబంధిత నాయకులు జార విడుచుకుంటారని మనం అనుకోలేం.
కొట్టిపారేయలేం.