రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నేతల ధర్నా, ఆంధోళనలు..
దాదాపు ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మందికి తక్కువ కాకుండా నిరసనలో పాల్గొనేలా వ్యూహరచన చేశారు గులాబీ అధినేత. రైతు సమస్యలపై ధర్నాలో మొత్తం మూడు లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ గురువారం బీజేపీ ధర్నా చేపట్టిన విషయం తెలిసినదే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేపడుతోంది. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు విజయవంతం అయ్యేలా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తున్నారు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద జంటనగరాల టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, నాయకులు రైతుల ధర్నాలో పాల్గొన్నారు.
ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న తరుణంలో జిల్లాల కలెక్టర్ల నుంచి ధర్నాలకు ముందే అనుమతి తీసుకున్నారు టీఆర్ఎస్ నేతలు. పంజాబ్ రాష్ట్రంలో పూర్తి వరి ధాన్యం కొంటున్న కేంద్రం తెలంగాణ నుంచి ఎందుకు తీసుకోవడం లేదని టీఆర్ఎస్ నేతలు కేంద్రపై మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి స్పష్టమైన వైఖరీని తెలపాలి అని డిమాండ్ చేస్తూ ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నిరసన నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు పోలీస్ సిబ్బంది. వరి ధాన్యం పై టీఆర్ఎస్, బీజేపీ నేతల యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో అని, వరిధాన్యం పై లొల్లి ఎప్పుడు సద్దుమనుగుతుందో అని ప్రజలు పేర్కొంటున్నారు.