రైతు గుప్పిట్లో : అతడు రాజే కానీ?
దేశానికి రాజే రైతు అని చాలా రోజులుగా వినిపిస్తున్న నినాదం. ఈ నినాదంతోనే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కూడా! కానీ నినాదం అమలు మాత్రం అలా లేదు. వివిధ పంటలకు ఏటా మద్దతు ధర ప్రకటించి తామేదో రైతులను ఉద్ధరిస్తున్నామని చెప్పినా కూడా అదేమీ వాస్తవం కాదని తేలిపోయింది. ఇక విత్తనాలు, ఎరువుల సరఫరాలో రైతులకు ప్రభుత్వాలు ఏ విధంగా సాయం చేస్తున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సాగుకు సంబంధించిన బాధ్యతల నుంచి ప్రభుత్వాలు పూర్తిగా తప్పుకుని వీటిని ప్రయివేటు పరం చేసేందుకు ఎప్పటి నుంచో ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. వేర్వేరు సందర్భాల్లో తమకు చెందిన వ్యక్తులకు లాభం చేకూరేందుకు వివిధ చట్టాలు తెరపైకి తెస్తున్నాయి. రుణమాఫీ పేరిట రాష్ట్రాలు చేస్తున్న సాయం కన్నా అక్కడ జరుగుతున్న మోసాలే ఎక్కువవుతున్నాయి. అందుకే కేంద్రం రుణమాఫీని వ్యతిరేకిస్తోంది. అలా అని రైతుకు తన తరఫున ప్రత్యేకించి చేసిన సాయాలు ఏమయినా ఉన్నాయా లేవు అన్నదే సమాధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలు వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నాణ్యమయిన రీతిలో ఉచిత విద్యుత్ అంటుంటే కేంద్రం మండిపడుతోంది. ఇలాంటి పరిణామాల్లో కేసీఆర్ కొంత, జగన్ కొంత తప్పిదాలు చేస్తూనే ఉన్నారు.
రైతులకు తామే మేలు చేస్తున్నామని చెప్పే మోడీ వ్యవసాయ చట్టాల పేరుతో అందరినీ నిలువునా ముంచే ప్రయత్నం ఒకటి చేశా రన్నది సుస్పష్టం అయిపోయింది. సేద్యంలో కార్పొరేట్ శక్తుల హవా ఇప్పటివరకూ నడవలేదు. కానీ ముందున్న రోజులలో సేద్యం అన్నది పూర్తిగా బడా కంపెనీల చేతికే పోనుంది. నల్ల చట్టాల అమలుపై పునరాలోచన కోరుతూ రైతులంతా ఏడాదిగా నిరసన వ్య క్తం చేస్తున్నది ఇందుకే! అదేవిధంగా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల కారణంగా బహిరంగ మార్కెట్ అంతా ప్రభుత్వం చేయి దాటి ప్రయివేటు శక్తుల చేతిలోకి వెళ్లిపోతుంది. వాళ్లంతా సిండికేట్ అయి నిర్ణయించే ధరలే వ్యవసాయదారులకు దిక్కవుతాయి. ఈ నేపథ్యంలో సాగు చట్టాలు వద్దని రైతులు పోరుబాట బట్టారు. ఢిల్లీ కేంద్రంగా చేస్తున్న నిరసనల కారణంగా ప్రస్తుతానికి కేంద్రం దిగివచ్చినా ముందున్న కాలంలో వీటిపై పెంచుకున్న ప్రేమను మాత్రం బీజేపీ సర్కారు వదులుకోబోదని చెప్పవచ్చు.