పోరాటానికి సిద్ధమైన కార్మిక సంఘాలు.. ప్రణాళిక ఇదేనా..!
2020 నవంబర్ 26వ తేదీన జరిగిన సార్వత్రిక సమ్మె 25 కోట్ల కార్మికులు ఉద్యోగులు పాల్గొన్న భారత్లో జరిగిన అతిపెద్ద సమ్మె అని అమెరికా దేశపు సోషలిస్టు పత్రిక" జాకోబ్" విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడాన్ని దేశ ప్రజలందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వ ఆర్థిక విధానం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఈ విధానం కేవలం కార్మికులకు కర్షకులకు మాత్రమే కాదు దేశ ప్రజల యొక్క అభివృద్ధికి ఆటంకమని ప్రజలు గ్రహిస్తే నే ఉద్యమం మరింత బలోపేతం అవుతుంది.
కార్మిక కర్షక సంఘాల ప్రధాన ఆరోపణలు:-
మనమందరము కళ్ళారా చూస్తూ అనుభవిస్తున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ తో పాటు నిత్యావసర సరుకుల ధరలు అదుపు లేకుండా పెరిగిపోతూ సామాన్య మధ్యతరగతి వర్గాలను అనేక ఇబ్బందులకు గురిచేయడంపట్ల కార్మిక సంఘాల ఐక్యవేదిక కేంద్ర ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించిన ట్లు తెలుస్తోంది. "నేషనల్ మానిటరింగ్ పైప్లైన్" అనే పేరుతో ప్రజా సంపదను జాతి ఆస్తులను విక్రయించడం పట్ల రైల్వేలు, రక్షణ రంగం, వైమానిక, ఓడరేవులను కూడా ప్రైవేటు పరం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని దేశ ప్రజలందరూ ప్రతి ఘటిస్తే తప్ప కేంద్రం దిగి రాదని మరొక్కమారు సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావాలని పిలుపు ఇవ్వడాన్ని సామాన్య ప్రజలు గా మన బాధ్యతను కూడా గుర్తించి ఉద్యమానికి సహకరిస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుంది.
వివిధ రూపాలలో, అనేక దశలలో ప్రజలు, కార్మికులు ,రైతులు, ప్రజాస్వామికవాదులు వ్యతిరేఖించినప్పటికి పట్టించుకోని ప్రభుత్వ విధానాన్ని తిప్పికొట్టడానికి ప్రజలను చైతన్యం చేయడమే పరిష్కారమని భావించిన కార్మిక సంఘాల ఐక్యవేదిక కృషిని పోరాట షెడ్యూల్ను దేశ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు.