రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. ఇప్పటి వరకు జరిగింది సగమే. అయితే.. ఈ సమయం లో నాయకులు.. ఏం చేశారు.. ఏం చేస్తున్నారనే విషయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికం సహా.. పరిషత్ ఎన్నికల్లో తమ తీర్పులు వెల్లడిస్తున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ఇప్పుడు వచ్చిన రిజల్ట్ చూసి.. చేతులు ఎత్తేసే పిరస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టం గురూ! అనే పెదవి విరుపు మాటలు కూడా వైసీపీ నేతల మధ్య వినిపిస్తున్నాయి. ఇలాంటివారిలో గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
గత 2019 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నాయకుడు.. వరుస విజయాలతో దూసుకుపోయిన.. జీవీ ఆంజనేయులుపై బొల్లా.. 28 వేల మెజారిటీతో గెలిచారు. దీనిని బట్టి.. ఆయనకు ప్రజలు ఎంత వాల్యూ ఇచ్చారో.. ఎన్ని ఆశలు పెట్టుకున్నారో.. తెలుస్తుంది. అయితే.. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత పంథా మార్చుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన పేదల ఇళ్ల పథకంలో తన చేతి వాటం.. బాగా చూపించారన్న ఆరోపణలు ఉన్నాయి. తనకు చెందిన అత్యంత చవకైన భూములను అతి ఎక్కువ ధరలకు ప్రభుత్వానికి విక్రయించి కోట్లు పోగేసుకున్నారనే వాదన నియోజకవర్గంలో బాగా వినిపిస్తోంది.
అంతేకాదు.. ప్రతి పనిలోనూ ఎమ్మెల్యే అవినీతి పెరిగిపోయిందని అంటున్నారు. అభివృద్ది శూన్యమని.. చెబుతున్నారు. దీంతో ఇక్కడి ప్రజలు మళ్లీ జీవీ వైపు ఆతృతగా చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే.. అప్పుడు జీవీని అద్భుత మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి జీవీ ఆంజనేయులు తన పార్టీ ప్రభుత్వంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా..ఆయన ప్రజల పక్షానే ఉన్నారు. అనేక సమస్యలకు పరిష్కారం చూపించారు. ఇంటింటికీ స్వయంగా వాటర్ ట్యాంకును నడుపుతూ.. గుమ్మానికి గుమ్మానికీ నీళ్లు అందించారు. శాశ్వత పరిష్కారం కోసం కృషి చేశారు. ఇక, సొంత నిధులు ఖర్చు పెట్టి పేదలకు అండగా ఉన్నారు.
కానీ, ప్రజంట్ ఎమ్మెల్యే మాత్రం చేతులు తడపకపోతే.. కష్టమనే బావన వ్యక్తం చేస్తున్నారనేది ప్రజల టాక్. మరోవైపు.. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా.. జీవీ మాత్రం ప్రజల పక్షాన అధికార పార్టీ ఎమ్మెల్యేకన్నా.. కూడా దూకుడుగా ఉన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. సమస్యలపై స్పందిస్తున్నారు. ఎక్కడికక్కడ ఏ సమస్య వచ్చినా స్వయంగా అక్కడకు హాజరువుతున్నారు. దీంతో ఎమ్మెల్యే కన్నా జీవీపేరే ఇక్కడి ప్రజల్లో బాగా వినిపిస్తుండడం గమనార్హం. అంతేకాదు.. జీవీ వల్లే ఇక్కడ అభివృద్ధి జరిగిందని.. అంటున్నారు. ఆయన మాత్రమే తమకు కనిపిస్తున్నారు.ఆయన మాటే తమకు వినిపిస్తోందని అంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా శావల్యాపురం జెడ్పీసీ ఎన్నికల్లో జీవీ తన సత్తా నిరూపించుకున్నారు. ఇక్కడి విజయం ప్రతిపక్ష టీడీపీలో ఉత్తేజాన్ని నింపింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలనే తపనతో ఆంజనేయులు, స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు చేసిన కృషి ఫలించి టీడీపీ గెలిచింది. వాస్తవానికి ఇక్కడ శావల్యాపురంలో జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే.. బ్రహ్మనాయుడు సవాల్ విసిరి మరీ జీవీని ఆహ్వానించారు.
దీంతో జీవీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగారు. దీంతో జీవీకే ప్రజలు జై కొట్టారు. టీడీపీ అభ్యర్థి పారా హైమావతి 1100 ఓట్ల తేడాతో భారీ విజయం దక్కించుకున్నారు. అయితే.. వైసీపీ తన ఓటమిని జీర్ణించుకోలేక.. టీడీపీ అభ్యర్థుల ఇళ్లపైనా దాడి చేశారు. ఈ పరిస్థితిని గమనిస్తే.. బ్రహ్మనాయుడు.. ఎన్నికలకు రెండేళ్లు ఉండగానే చేతులు ఎత్తేశారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.