అమరావతిపై జగన్ స్టాండ్ ఏమిటో...!
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో భూ కుంభకోణం జరిగిందని ఆరోపించిన వైసీపీ... సీబీసీఐడీ ద్వారా విచారణ జరిపించింది. దీనిపై హైకోర్టులో కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చివరికి రైతుల పాదయాత్రకు కూడా అనుమతి ఇచ్చేందుకు కాస్త వెనుకడుగు వేసిందనే అపవాదు కూడా మూటగట్టుకుంది ప్రభుత్వం. అయితే ఇప్పుడు మూడు రాజధానుల బిల్లును రద్దు చేసిన తర్వాత జగన్ సర్కార్.... ఇప్పుడు అమరావతి రాజధానిపై కొత్త మాట మాట్లాడుతోంది. అమరావతి రాజధానిగా ప్రస్తుతం జగన్ సర్కార్ తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంది. అయితే రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ప్రసంగం చేసిన వైఎస్ జగన్... అమరావతి రాజధానిపై కొత్త మాట మాట్లాడారు. తమకు అమరావతి అంటే ఏ మాత్రం వ్యతిరేకత లేదన్నారు. అయితే ఇప్పుడు కొత్త రాజధాని నిర్మించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు జగన్. రాజధాని నిర్మించాలంటే... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకంగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయన్నారు జగన్. రాజధాని కోసం 50 ఎకరాలు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ప్రతి ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇంత ఖర్చు భరించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు.