బిజెపి ఆంతర్యం ఏమిటబ్బా !?
భారత పార్లమెంట్ చరిత్రలో ఇది ఒక ప్రత్యేక సంఘటనగాచెప్పుకోవచ్చు...సహజంగా అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనేటప్పుడే అధికార పక్షం తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేయడం పరిపాటి. ఎందుకంటే సభలో సభ్యుల విశ్వాసాన్ని పాలకులు పొందాలి గనుగ. అందుకోసమే అధికార పక్షం తన సభ్యులు తప్పని సరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని అదేశిస్తుంది. కానీ సభలో అత్యధిక మెజార్జీ ఉన్న భారతీయ జనతా పార్టీ తన సభ్యులకు తాజాగా విప్ జారీ చేసింది. ఇందులో ఏదైనా ఆంతర్యం ఉందా ? అని రాజకీయ పరిశీలకులు నెత్తి గోక్కుంటున్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో చాలా బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. వాటిపై విస్త్రృత స్థాయిలో చర్చలు జరిగే అవకాశమూ లేకపోలేదు. పై పెచ్చు మరి కొద్ది నెలల్లో ఉత్తరాదిన ఉత్తర ప్రదేశ్ తో సహా పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఈ శీతాకాల సమావేశాలకు చాలా ప్రాధాన్యత ఉంది. గత ఏడాది శీతా కాల సమావేశాల్లో ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. ఆఖరుకు సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ జాతికి క్షమాపణ చెప్పారు. ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటామని వెల్లడించారు. ఈ బిల్లుల ఉపసంహరణ కూడా ఈ శీతాకాల సమావేశాల్లోనే సభ ముందుకు వచ్చేఅవకాశ ముందని పార్లమెంటు వర్గాల సమాచారం. వీటితో పాటు, పాతికకు పైగా బిల్లలను కూడా సభ ఆమోదించాల్సి ఉంది. ప్రతి బిల్లు పైనా ప్రతి పక్ష సభ్యులు తమ దైన శైలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వాటా 51 వరకూ ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాను 26 వరకూ తగ్గించే అవకాశం ఉందని గతంలో ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బిల్లు కూడా ఈ శీతాకాల సమావేశాల్లోనే సభ ముందుకు రానున్నట్లు సమాచారం. అదే విధంగా క్రిప్టో కరెన్సీ కి సంబంధించిన బిల్లు కూడా ఈ శీతాకాల సమావేశాల్లోనే సభ ముందుకు రావచ్చునని భారతీయ జనతా పార్టీ సీనియర్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో... తమ పార్టీ సభ్యులంతా తప్పని సరిగా సభకు హాజరు కావాలని బిజేపి తన ఎంపీలకు విప్ జారీ చేసింది.