ఆంధ్రావనిలో కొత్త వివాదం ఒకటి మొదలు కానుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు.ఈ లెక్కన ఇప్పుడున్న జిల్లాలకు బదులు కొత్తగా వచ్చే ప్రతిపాదనల మేరకు 25 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అయితే మరో జిల్లాను కూడా అదనంగా చేసేందుకు అవకాశం ఉంది. వీటి ఏర్పాటుపై ఎప్పటి నుంచో తర్జనభర్జనలు ఉన్నాయి. కానీ ఇవేవీ ఓ కొలిక్కి ఇప్పటిదాకా రాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు అన్నది జనగణన పూర్తయ్యాకే చేపట్టాలని నియమ నిబంధనలు చెబుతున్నాయి. దీంతో వచ్చే ఏడాది మార్చి తరువాత కానీ కొత్త జిల్లాల ఏర్పాటు అన్నది జరగదు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఇప్పటికే ఐదు ఐటీడీఏలను కలిపి ఓ రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అల్లూరి సీతారామరాజు పేరిట ఓ మన్యం జిల్లాను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం కూడా ఒప్పుకునే వీలుంది. సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, పోలవరం ఐటీడీఏలను కలిపి మన్యం జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో జిల్లాల పునర్విభజనపై కూడా ఓ సమాలోచన చేయాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాల ఏర్పాటు పేరిట హడావుడి చేసే కన్నా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం కేంద్రంగా ఓ రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అలానే పలు చోట్ల రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదనలు ఉన్నాయి. వీటినన్నింటినీ సాల్వ్ చేయాలని విన్నపాలు ప్రభుత్వానికి వెళ్తున్నాయి. విజయనగరంలో కూడా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేసే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది. జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లనూ పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. అయితే జిల్లాల ఏర్పాటు కన్నా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటే కాస్త పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.