క్షమాపణలు కోరడం తప్పు కాదు కానీ
కోరే విధానంలో నిజాయితీ కూడా ఉండాలి
ఆ నిజాయితీ ఆయనతో ఉంటే
ఆయనే ఎప్పటికీ హీరో కాగలరు!
కనుక ఇప్పటి నుంచి మన రాజకీయాల్లో వచ్చే మార్పు
ఈ క్షమాపణ నుంచి మొదలవ్వాలి అని కోరుకోవడం
అత్యాశ కాదనే అనుకోవాలి మీరు మరియు నేను
రాజకీయం అంటే అన్నీ ఉండాలి..కోపాలూ తాపాలూ తిట్లూ ఛీత్కారాలు ఇంకా చాలా..అవన్నీ దాటొచ్చాక సింపుల్ గా ఓ సారీ చెబితే అన్నీ అవే సర్దుకుపోతాయి. అలా సర్దుకుపోవడంతోనే రాజకీయం ముగిసిపోదు. అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్లాలి. వెళ్తుంది కూడా! ఆ విధంగా వెళ్లకపోతే తీసుకువెళ్లే వారూ, మోసుకు వెళ్లే వారు ఉండనే ఉంటారు. అప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి. పూలే కాదు ముళ్లూ ఉన్నాయి. ఉంటాయి కూడా! అలాంటప్పుడు మనం పూలను ప్రేమించి ముళ్లను వద్దనుకుని తీరడం తప్పు! మనం మనతో పాటు మన ప్రియమయిన నేతలు కూడా! రాజకీయంలో నైతికం ఆశించకండి. రాజకీయంలో రాజనీతిజ్ఞత ఆశించకండి. పాటించాల్సినంత, చేయాల్సినంత, చెందాల్సినంత కొన్ని విలువలు వాటి సంబంధ పనులు తప్పక చేయండి. ఆ విధంగా మీరు పెద్దవారు కాకపోయినా లోకం దృష్టిలో చిన్నవారు కాబోరు.
ఇప్పుడు ఆంధ్రావని రాజకీయాలు వీటికి భిన్నంగా ఉన్నాయి. ఉంటాయి కూడా! అలా ఉన్నప్పుడే కదా! వార్తలు వస్తున్నాయి.. అప్పుడే కదా తీరిగ్గా వండి వార్చే కథనాలూ పుట్టుకువస్తున్నాయి. తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం ప్రకటించారు వంశీ. టీడీపీ అధినేత చంద్రబాబు భార్యను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. ఇంతటితో ఈ వివాదం ముగిసిపోతుందని పోనుందని ఓ గౌరవ మీడియా తీర్పు కూడా ఇచ్చేసింది. కానీ ఇక్కడితో ఎందుకు ఆగుతుంది. అంతటి విజ్ఞత మన నాయకుల్లో ఎందుకు కోరుకోవాలి. కోరుకున్నా అవి నెరవేర్పునకు నోచుకోవు కదా! అందుకనో ఎందుకనో మన రాజకీయ నాయకుల్లో మంచిని ఆశించడం, మన చంద్రబాబు నుంచో, మన జగన్ నుంచో సంస్కరణ వాదం ఆశించడం అత్యాశ అవుతుంది. కనుక తిట్టేవారు తిడతారు తిట్టించే వారు తిట్టిస్తారు.. ఇదే నయా పాలసీ..