WHO నుంచి ఉపశమనం కలిగించే వార్త..!
ఇక ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వస్తున్న వారికి టెస్టులు చేస్తున్నామని చెప్పారు. 58ఫైట్లలో వచ్చిన 16వేల మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశామన్నారు. అందులో 18మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అది ఒమిక్రాన్ వేరియంటా..? కాదా అని తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపామని తెలిపారు.
ప్రపంచంలో మిగతా దేశాల కంటే మనదగ్గరే కరోనా కేసులు, మరణాలు తక్కువ అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ అన్నారు. ఇప్పటి వరకు 3.46కోట్ల కేసులు, 4.6లక్షల మరణాలు నమోదయ్యాయని చెప్పారు. మొత్తం కేసుల్లో మరణాలు 1.36శాతం మాత్రమేనన్నారు. మన దేశ జనాభాలో 10లక్షల మందిలో 25వేల కేసులు, 340మరణాలే నమోదవుతున్నాయని వివరించారు. మిగతా దేశాలతో పోలిస్తే మనదేశంలో తక్కువ అని పేర్కొన్నారు.
ప్రధాని మోడీ నాయకత్వంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. గత ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని విస్మరించిందని విమర్శించారు. దేశంలో జనవరి 13, 2020 నాడు కేరళలో తొలి కేసు నమోదైతే.. కేంద్రం మొదటి జాయింట్ మానిటరింగ్ కమిటీ జనవరి 8, 2020నే ప్రారంభించిందని తెలిపారు. దీన్నిబట్టి తాము అప్రమత్తంగా ఉన్నట్టు అర్థమవుతుందన్నారు.