టీడీపీలో సొంత దుకాణాలు.. బాబు మాట భేఖాతార్..!
జిల్లాలోని ఎమ్మిగనూరు - ఆలూరు నియోజకవర్గాల్లో టీడీపీలో వర్గపోరు రాజుకుంది. ఎమ్మిగనూరులో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సొంతంగా ఒక పార్టీ ఆఫీస్ ప్రారంభించారు. అయితే ఇక్కడ టిడిపి ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ఉన్నారు. అక్కడ ఆయన ఆఫీస్ ఉండగానే కోట్ల మరో ఆఫీస్ తెరవడంతో చర్చ నడుస్తోంది. కోట్ల ఆఫీస్ కు ఎవరు వెళ్ళవద్దని కూడా జై నాగేశ్వర్ రెడ్డి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు సంకేతాలు ఇచ్చారట.
జయ నాగేశ్వర్ రెడ్డి స్వయంగా చెప్పడంతో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు కూడా కోట్ల ఆఫీస్ ఓపెనింగ్కు వెళ్లకపోవడంతో కోట్ల కొందరు నేతలతోనే అక్కడ ఆఫీస్ ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఆలూరు లో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కోట్ల సుజాతమ్మ వర్సెస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ మధ్య ఇప్పుడు వార్ నడుస్తోంది. వీళ్ళిద్దరికీ ఇప్పటికే విభేదాలు ఉన్నాయి.
2014 ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేసిన వీరభద్ర గౌడ్ స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే గత ఎన్నికల్లో వీరభద్ర గౌడ్ ను పక్కన పెట్టి కోట్ల సుజాతమ్మ కు చంద్రబాబు సీటు ఇచ్చారు. అయితే ఆమె కూడా ఓడిపోయారు. ఇప్పుడు వీరిద్దరూ రెండు ఆఫీస్ లు ఓపెన్ చేయడం తో టీడీపీ రాజకీయం రసకందాయంలో పడింది.